డిప్యూటీ స్పీకర్కు 'మీడియా' షాక్, కెసిఆర్కు మూడింది, దించేదాకా నిద్రపోను: రేవంత్
మెదక్: మీడియా పట్ల డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ విలేకరులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రభుత్వం తలపెట్టిన సంక్షఖేమ కార్యక్రమంలో పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె టి న్యూస్ను మాత్రమే అనుమతించాలని ఆదేశించారని విలేకరులు ఆరోపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టీ న్యూస్ తప్ప తమకు వేరే ఛానల్ వద్దని మాట్లాడారని చెప్పారని అంటున్నారు. దీంతో, విలేకరులు నిరసన తెలిపారని తెలుస్తోంది.
మావోయిస్టుల అజెండానే కేసీఆర్ అజెండా: కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుది సోషలిస్ట్ అజెండా అని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వేరుగా అన్నారు. మావోయిస్టులు ఏం సాధించాలని పోరాడుతున్నారో అదే ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు.
మావోయిస్టులు అడవిని వదలిపెట్టి, జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. ప్రజా సంక్షేమంలో భాగస్వాములు కావాలన్నారు. బీర్పూర్, తుంగూరులలో మన ఊరు - మన ఎంపీ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
కెసిఆర్ను దించే వరకు నిద్రపోను: రేవంత్ రెడ్డి
కెసిఆర్ను కుర్చీ నుంచి దించే వరకు తాను నిద్రపోనని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. ఆయన దౌల్తబాద్ పోలీసు స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమను నిర్బందించి బెదిరించలేరన్నారు.
అవినీతిని ఎండగడుతున్న కెసిఆర్ ప్రతిపక్షాలను అణగదొక్కుతున్నారన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇంటింటికీ చిప్ లిక్కర్ ఇవ్వడమేనా అని ధ్వజమెత్తారు. యూపీ, బీహార్ లిక్కర్ మాఫీయాతో కేసీఆర్ కుమ్మక్కయ్యారన్నారు. తెలంగాణలో ఆయనకు కాలం మూడినట్టేనన్నారు.