కోవిడ్ ఆసుపత్రిగా పాత సచివాలయం: 3 వేల పడకలతో: కిషన్ రెడ్డి సూచనకు కేసీఆర్ స్పందిస్తారా?
హైదరాబాద్: కరోనా వైరస్ తెలంగాణను కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని నియంత్రించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుంటుందనే అంశంపై ప్రస్తుతం అందరి దృష్టీ నెలకొంది. దేశంలోనే అత్యంత తక్కువ స్థాయిలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించిన రాష్ట్రంగా ఇప్పటికే ఓ అవాంఛనీయ గుర్తింపును పొందిన తెలంగాణలో రోజురోజుకూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
డేంజర్జోన్లో తెలంగాణ..
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తరహాలో తెలంగాణ కూడా డేంజర్జోన్లో వెళ్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యర్థులు. కేసీఆర్ సర్కార్పై విమర్శలను ఎక్కుపెడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్లో కరోనా బాంబు..
తెలంగాణలో ఈ తరహా పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నైలతో బాటు హైదరాబాద్ డేంజర్జోన్లో ఉందని హెచ్చరించారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఫలితంగా అతి తక్కువ పరీక్షలను చేసిన రాష్ట్రంగా ఎవరూ కోరుకుని రికార్డును నెలకొల్పిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ బాంబుపై హైదరాబాద్ ఉందని, అది ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్తితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పాత సచివాలయాన్ని కూల్చేయడం ఎందుకు?
కరోనాను నియంత్రించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు పెద్దఎత్తున సహాయం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు. పాత సచివాలయాన్ని కూల్చివేయకుండా దాని కోవిడ్ ఆసుపత్రిగా మార్చుకోవాలని సూచించారు. పాత సచివాాలయాన్ని కోవిడ్ ఆసుపత్రిగా మార్చుకోవడం వల్ల కనీసం మూడువేల పడకలను అందుబాటులోకి తీసుకుని రావచ్చని అన్నారు.
కేంద్రం సహకరించినా..
తగినన్ని ఆసుపత్రులు, పడకలు లేక వేలాదిమంది కరోనా వైరస్ పేషెంట్లు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పాత సచివాలయాన్ని కోవిడ్ కేర్ సెంటర్గా మార్చాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తరఫున తాము సహకరిస్తామనీ అన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు. కేంద్ర బృందాలు రెండుసార్లు పర్యటించి ఇచ్చిన సూచనలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
Recommended Video
ఎంఐఎం ఆదేశాలతో
మిత్రపక్షం ఎంఐఎం ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలను తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దారుస్సలాంలోని ఎంఐఎం ప్రధాన కార్యాలయం రిమోట్తో ప్రగతిభవన్ను నడిపిస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోనే అత్యధిక కరోనా మరణాలు ఎందుకు నమోదవుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో పెద్దసంఖ్యలో కరోనా కేసులు వస్తున్నా సర్కారులో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు.