కెసిఆర్ ప్రభుత్వం రెండేళ్లే: పాల్వాయి, ఉస్మానియా తరలింపుపై నాగం
నల్లగొండ/ హైదరాబాద్: మరో రెండేళ్ళలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, ఈ విషయాన్ని తాను కచ్చితంగా చెబుతున్నానని తెలంగాణ కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు.
కెసిఆర్ చెబుతున్న మాటలకు, చేస్తున్న చేతలకు ఏ మాత్రం పొంతలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ మాటలు కోటలుదాటాయని, తీరా సీఎం కుర్చీలో కూర్చోగానే అన్ని మరచిపోయి తన ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు
టిఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు భారీగా పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్లు, పరిశ్రమల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని, ఆయన సోదరుడు కలెక్షన్ ఏజంటుగా మారారని పాల్వాయి ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి అవినీతి వెనుక మంత్రి జగదీష్ రెడ్డి ప్రోత్సాహం ఉందని మండిపడ్డారు.
ఇదిలావుంటే, ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతను అడ్డుకుంటామని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. అబ్దుల్ కలాం పేరెత్తే అర్హత కేసీఆర్కు లేదని ఆయన మండిపడ్డారు. కలాం అంత్యక్రియలకు ప్రభుత్వ ప్రతినిధిని కూడా పంపలేదని ఆయన అన్నారు.
కరువు మండలాలను ప్రకటించని ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని నాగం విమర్శించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల గురించి ఆలోచిస్తే, రూ.15 వేల కోట్లతో 30 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చని నాగం జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు.