కేసీఆర్ స్వామిభక్తి: ఫస్ట్ యాదాద్రి..నెక్స్ట్?: బ్రాహ్మణులను ఆకట్టుకోవడానికేనా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు స్వామి భక్తి కాస్త ఎక్కువే. తరచూ ఆలయాలను సందర్శిస్తుండటం, యజ్ఙయాగాదులను నిర్వహిస్తుండటం ఆయన ప్రత్యేకత. లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదాద్రిని ఆయన ఏ స్థాయిలో తీర్చిదిద్దారో తెలిసిన విషయమే. తిరుమల పుణ్యక్షేత్రం తరహాలో యాదాద్రిని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. అదే తరహాలో రాష్ట్రంలో మరిన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి కేసీఆర్ సర్కార్ సంకల్పించింది.
వార్షిక బడ్జెట్లో రూ. 500 కోట్లు..
దీనికోసం 2020-2021 వార్షిక బడ్జెట్లో దేవాదాయ శాఖకు 500 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. గ్రామస్థాయిలో ఆలయాలకు ఆర్థిక వనరులను సమకూర్చడానికి ఉద్దేశించిన ధూప, దీప, నైవేద్యం పథకాన్ని కొనసాగించడానికి మరో 50 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించింది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు 2020-2021 వార్షిక బడ్జెట్లో ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు.
యాదాద్రి.. ఇక భద్రాద్రి..
లక్ష్మీనరసింహ స్వామి వెలిసిన యాదాద్రిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కేసీఆర్ సర్కార్. 2014లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే యాదాద్రి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తూ వచ్చింది. వంద కోట్ల రూపాయల వ్యయంతో ఆలయాన్ని అభివృద్ధి చేసింది. ప్రత్యేకంగా ఓ మాస్టర్ ప్లాన్ను రూపొందించి.. మరీ యాదాద్రిని రూపురేఖలను సమూలంగా మార్చివేసింది. అదే తరహాలో వచ్చే అయిదేళ్లలో మరి కొన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది.
మూడు ఆలయాలు అభివృద్ధి..
ఈ సారి భద్రాద్రి సహా మరి కొన్ని ప్రముఖ ఆలయాలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి పూనుకుంది. దీనికోసం వార్షిక బడ్జెట్లో 500 కోట్ల రూపాయలను దేవాదాయ శాఖకు కేటాయించింది. ఈ మొత్తంతో ఈ ఏడాదిలోనే కనీసం మూడు ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టిందనే విషయం స్పష్టమైందని అంటున్నారు. భద్రాద్రి, వేములవాడలను ఈ జాబితాలో చేర్చబోతున్నట్లు సమాచారం.
ధూప, దీప, నైవేద్యానికి..
గ్రామస్థాయిలో కనీసం ఆదాయం కూడా లేని చిన్న ఆలయాలకు ఆర్థిక వనరులను సమకూర్చడానికి ఉద్దేశించిన ధూప, దీప, నైవేద్యం పథకానికి అదనంగా 50 కోట్ల రూపాయలను కేటాయించింది. కనీస ఆదాయం లేని ఆలయాల్లో పనిచేసే అర్చకులు, సిబ్బందికి వేతనాలు, స్వామి వారికి ఉదయం, సాయంత్రం వేళ్లలో దీపారాధన చేయడానికి ఈ మొత్తాన్ని వినియోగించాల్సి ఉంటుంది. కేసీఆర్ చేపట్టిన ఈ రెండు చర్యల వల్ల బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.