నల్గొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు -సీఎం కేసీఆర్ చెప్పిన గంటల్లోనే సర్కార్ ఉత్తర్వుల
నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసినట్లుగానే నల్గొండ జిల్లాకు మరో మూడు ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయి. సోమవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాల్ని ప్రకటించిన సీఎం.. వాటిని ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని చెప్పారు.
నల్లగొండ జిల్లాకు మంజూరైన మరో 3 ఎత్తిపోతల పథకాల వివరాలిలా ఉన్నాయి.. రూ. 9.3 కోట్లతో వేములపల్లి వద్ద తోపుచర్ల ఎత్తిపోతల పథకం, దామరచర్ల మండలం తుండపాడువాగుపై మరో ఎత్తిపోతలను, రూ.322.22 కోట్లతో వీర్లపాలెం రెండోదశ ఎత్తిపోతల పనులను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కట్టంగూరు మండలం చెరువు అన్నారం వద్ద రూ. 101.62 కోట్లతో అయిటిపాముల ఎత్తిపోతల పథకానికి అనుమతులిచ్చింది. అలాగే,
నెల్లికల్లు ఎత్తిపోతల పథకం స్వరూపం, పనుల్లో మార్పు చేసింది. గతంలో చేపట్టిన నెల్లికల్లు పనులకను ప్రీక్లోజర్ చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించనుంది. రూ.664.80 కోట్లతో నెల్లికల్లు ఎత్తిపోతలకు కొత్తగా నీటిపారుదలశాఖ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. నెల్లికల్లు వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం, ఇతర పనులకు అనుమతులు ఇచ్చింది.
నల్గొండ జిల్లాలో 15 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలతోపాటే, నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేస్తామని, హాలియా, నందికొండ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ, ఏపీతో జలవివాదాలనూ సీఎం ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని.. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.