అత్యాచార నిందితులను ఉపేక్షించేది లేదు: ‘కేసీఆర్ ఉగ్రరూపం’ అంటూ మంత్రి తలసాని
హైదరాబాద్: దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. అంతేగాక, కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
దిశకు న్యాయం జరగాలని దేశమంతా ఎదురు చూసిందని.. ఇందుకు తగ్గట్లుగానే నిందితుల ఎన్కౌంటర్తో తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పిందని మంత్రి తలసాని అన్నారు.
తెలంగాణ పోలీసుల సత్తా ఏంటో గతంలోనే నిరూపించుకున్నారని, ఇంతకుముందు ఉగ్రవాది అయిన వికారుద్దీన్ అతని గ్యాంగ్, నయీమ్ గ్యాంగ్ వంటి ఎన్నో కేసులను తెలంగాణ ప్రభుత్వం ఛేదించిందని తెలిపారు. ఇటీవల దిశ దారుణ ఘటనపై యావత్ దేశం ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం స్పందించడం లేదని పదే పదే కేసీఆర్ను విమర్శించారని, ఆయన వెళ్లి బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించలేదని దుయ్యబట్టారని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రారు.. ఆయనకు ఉగ్ర రూపం వస్తే ఏ విధంగా ఉంటుందో చాలా మందికి తెలుసు.. కొంత మంది ఏ అవకాశం వచ్చినా ఇలా దుమ్మెత్తిపోస్తుంటారని తలసాని మండిపడ్డారు.
గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి కానీ, కాలం కలిసొచ్చినప్పుడు లేదా పోయే కాలం దగ్గరికొచ్చినప్పుడు ఇలాంటి ఎన్ కౌంటర్లు జరుగుతుంటాయన్నారు. ఆడపిల్లల్లో తల్లినో.. చెల్లినో.. చూసుకోవాలి.. తేడాగా ప్రవర్తిస్తే తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్లే జరుగుతాయని మంత్రి తలసాని హెచ్చరించారు. ఆడపిల్లలపై వేధింపులకు పాల్పడే వారిని తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని తేల్చి చెప్పారు.
వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితులను శుక్రవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేసు రీ కన్స్ట్రక్చన్ కోసం నిందితులను దిశను హత్య చేసిన స్థలానికి తీసుకెళ్లగా.. అక్కడ నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు.