గుత్తాకు రూట్ క్లియర్..! : కారెక్కడం లాంఛనమేనట.. కానీ ఆ ఒక్కటీ..!
హైదరాబాద్ : కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీకి రివర్స్ గేర్ లో వెళ్తున్న నల్గొండ పాలిటిక్స్..ఊహించినట్టుగానే పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికార పార్టీ వైపు చూస్తోన్న తరుణంలొ.. వెంకట్ రెడ్డి వ్యవహారంపై ఇంకా క్లారిటీ రానప్పటికీ, సుఖేందర్ రెడ్డి మాత్రం కారెక్కేందుకు మార్గం సుగమం అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో భేటీ అయిన సీఎం కేసీఆర్, ఈ మేరకు గుత్తా సుఖేందర్ రెడ్డికి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే రాజీనామాతో పనిలేకుండానే కేసీఆర్ గుత్తాను పార్టీలోకి ఆహ్వనించారన్న ఓ వాదన వినిపిస్తుంటే, రాజీనామా చేసే పార్టీలోకి వస్తానని గుత్తా అభిప్రాయ పడినట్టుగా మరో వాదన వినిపిస్తుంది. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన విషయాన్ని కేసీఆర్ గుత్తాకే వదిలిపెట్టారన్న చర్చ కూడా జరుగుతుంది.
ఇదిలా ఉంటే.. భవిష్యత్తు రాజకీయాల్లో గుత్తాకు టీఆర్ఎస్ తరుపున కేబినెట్ హోదా దక్కడమో, లేక 2018లో రాజ్యసభ సీటు ఇవ్వడమో, ఇవేవి కాకపోతే ప్రభుత్వ సేవల కోసం సలహాదారుడిగా నియమించుకోవడమో జరుగుతాయన్న ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో, పార్టీలో ఆయనకు ఎలాంటి స్థానం దక్కుతుందనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.
కేసీఆర్ నుంచి క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో.. ఆయన రాజీనామా అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే గుత్తా రాజీనామాకు వెళ్తారా, లేక ఏపీలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేయకుండానే టీడీపీలో చేరిపోయిన తరహాలో గుత్తా చేరిక కూడా ఉండబోతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.