ఫ్యామిలీతో కెసిఆర్: డిఎస్ ఇంటికి వచ్చి, కేక్ తినిపించారు (ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్లోని డీఎస్ నివాసంలో జరిగిన బర్త్డే వేడుకలకు సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, మనుమడు, మనుమరాలు ఉన్నారు.
ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు తన ఇంటికి వచ్చిన సీఎం కేసీఆర్కు డీఎస్, ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అతిథుల సమక్షంలో డీఎస్ తన 67వ జన్మదినోత్సవాన్ని కేక్ కట్ చేసి జరుపుకొన్నారు. అందరికీ కేక్, స్వీట్లు అందించారు. కలిసి భోజనాలు చేశారు. డీఎస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. డీఎస్ దంపతులు కేసీఆర్ కుటుంబ సభ్యులకు బట్టలు పెట్టారు.
సుమారు రెండున్నరగంటలపాటు డీఎస్ ఇంట్లో గడిపిన కేసీఆర్ ఆయనతో పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. తాజాగా తన చైనా పర్యటన గురించి సీఎం కేసీఆర్ డీఎస్కు వివరించినట్టు తెలిసింది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా కేసీఆర్, డీఎస్లు చర్చించుకున్నట్టు సమాచారం.
తెలంగాణ సర్కారు చేపడుతున్న, సామాజిక, సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాను ఇరువురూ వ్యక్తం చేసినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు సంబంధించిన అంశంపైకూడా వారు మాట్లాడుకున్నట్లు తెలిసింది. విపక్షాలకు దీటుగా వ్యవహరించాల్సిన అవసరంపై, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై కూడా ఇరువురు మాట్లాడినట్టు సమాచారం.