రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆర్ చేసింది జీరో: ఆజాద్ సంచలనం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కెసిఆర్ పాత్ర శూన్యమని కాంగ్రెసు నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. రాష్ట్రం ఇచ్చిన తమను తెలంగాణ ప్రజలు ఓడించడం దురదృష్టకరమని అన్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ చేసింది శూన్యమని కాంగ్రెసు నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెసు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కెసిఆర్ కుటుంబంలోనే అభివృద్ధి జరిగిందని ఆజాద్ విమర్శించారు.
తెరాస పాలనలో తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల డిమాండ్ అర్థం చేసుకొని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ఓట్లు వేయకపోవడం దురదృష్టకరమని ఆజాద్ అన్నారు.
జాతీయ పార్టీలో తెరాస విలీనం అంశం గురించి మీడియా ప్రతినిదులు ప్రశ్నిచంగా - అది పాత విషయమని కొట్టిపారేశారు. రాష్ట్ర ఏర్పాటులో తెరాస పాత్ర ఏమీ లేదని గుర్తించి తెలంగాణ ప్రజలు వచ్చే పార్లమెంటు లేదా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఓటేస్తారని ఆయన అన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం తరఫున ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ఆధ్వర్వంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ వోరా తదితరులు హాజరయ్యారు.