అటు మామ, ఇటు అల్లుడు.. నామినేషన్ల ప్రక్రియ పూర్తి
అభ్యర్థులను ప్రకటించడం మొదలు నామినేషన్ల పర్వంలోనూ టీఆర్ఎస్ ముందుంది. అసెంబ్లీ రద్దు తర్వాత వెంటనే 105 మంది అభ్యర్థులను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన కేసీఆర్ ప్రచారంలోనూ దూసుకెళ్లేలా పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఇటు నామినేషన్ల ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు విషయంలో అభ్యర్థులకు స్వయంగా కేసీఆరే సూచనలు ఇచ్చారు. గజ్వేల్ నుంచి బరిలో నిలిచిన కేసీఆర్ తన నామినేషన్ దాఖలు చేశారు.
గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు కేసీఆర్. వేద పండితులు సూచించిన ముహుర్తం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషాలకు నామినేషన్ వేశారు. హడావిడి లేకుండా కొద్దిమంది అనుచరులతో మాత్రమే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. దైవం, జ్యోతిషం, వాస్తుశాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ తన లక్కీ నెంబర్ 6 కావడంతో 15వ తేదీ గురువారం నామినేషన్ వేసే అవకాశముందనే ప్రచారం జరిగింది. అయితే 12,14,16,18 తేదీల్లో మాత్రమే మంచి రోజులున్నాయన్న పండితుల సూచన మేరకు 14వ తేదీని ఎంచుకుని బుధవారం కేసీఆర్ నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది.
సిద్దిపేట నుంచి ఎన్నికల బరిలో నిలిచిన హరీశ్ రావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి బయలుదేరిన హరీశ్ రావు ఈద్గా చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నేతలున్నారు.