సర్కారీ విద్యను దూరం చేసి పేద విద్యార్థులకు ఆర్థిక భారాన్ని మోపిన పాపం కేసీఆర్ దే.!విజయశాంతి ఫైర్.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ విధానాలపై, సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుపై బీజేపి సీనియర్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. పేదవాడి చదువును ఆర్ధిక భారంగా మార్చి వేసి పైశాచిక ఆనందంపొందుతున్నారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై భగ్గుమన్నారు రాములమ్మ. సంస్కరణల పేరుతో విద్యను పేదవాడికి అందరి ద్రాక్షగా మార్చివేసి సరైన హాజరు శాతం లేదని పాఠశాలలను మూసివేస్తున్న ఘనత కూడా సీఎం చంద్రశేఖర్ రావుదే నని విజయశాంతి ధ్వజమెత్తారు.

ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడతామనడం ఓ డ్రామా..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థులకు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని గప్పాలు కొట్టిన సీఎం చంద్రశేఖర్ రావు, ఉచిత విద్య దేవుడెరుగు, ఉన్న ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో మూసివేసి, మారుమూల గ్రామాల విద్యార్థులకు సర్కారీ విద్యను దూరం చేసి పేద తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని పెంచారని విజయశాంతి ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడతామంటూ కొత్త డ్రామా మొదలెట్టారని ఎద్దేవా చేసారు.

ధనిక రాష్ట్రమని చెప్తున్న సీఎం..
అసలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, పిల్లల కోసం టాయిలెట్లు కూడా నిర్మించని దుస్థితి తెలంగాణలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేసారు విజయశాంతి. ఇక ధనిక రాష్ట్రం మనదని గొప్పలు చెప్పిన సీఎం చంద్రశేఖర్ రావు ఏనాడూ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నరు. అలాంటిది, నేడు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పేరుతో ప్రజల్ని మరోమారు తప్పుదోవ పట్టిస్తూ, కార్పొరేట్ స్కూళ్ల నుంచి డబ్బులు వసూలు చేయడం కోసమే ఈ ప్రతిపాదన చేసారు తప్ప, పేద విద్యార్థుల పట్ల ప్రేమతో మాత్రం కాదని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు విజయశాంతి.

విద్యాహక్కు చట్టం అమలు చేస్తే చాలు..
రాష్ట్రంలో ఏడేండ్లుగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ఇప్పటివరకు నోటిఫికేషన్ జారీ చేయకుండా, విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను ఎలా అందిస్తారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు విజయశాంతి. కేంద్రం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని తెలంగాణలో అమలుచేస్తే, రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం మేరకు సీట్లు పేద విద్యార్థులకు దక్కేవని, కానీ,కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పేరుతో విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో సీఎం చంద్రశేఖర్ రావు అమలు చేయకుండా ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేస్తున్నారని విజయశాంతి ఫైర్ అయ్యారు.

దగాకోరు ముఖ్యమంత్రి..
ఇక కరోనా పేరుతో ముందస్తు జాగ్రత్త కోసమే విద్యాసంస్థలను మూసివేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రశేఖర్ రావు, బార్లు, పబ్ల మూసివేత విషయంలో అదే ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదో చెప్పాలని నిలదీసారు. పబ్బులు, బార్లల్లో కొవిడ్ మరణాలు చోటు చేసుకుంటున్నా ఆదాయం కోసమే వాటిని నియంత్రించకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి పూనుకుని రాజకీయనాటకాలకు తెరతీస్తున్న ఈ దగాకోరు ముఖ్యమంత్రికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి.