ప్రధాని అభ్యర్థి ఎవరో.. డిసైడ్ చేసిన ఒవైసీ: ఆయనకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయట
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అత్యధిక లోక్ సభ స్థానాలను కట్టబెడితే.. దేశానికి ప్రధాని మంత్రి ఎవరో తామే నిర్దేశిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాల యువ నాయకులు కేటీఆర్, నారా లోకేష్ కోరస్ గా లిరిక్ అందుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించడానికి ఈ రకంగా కూడా వారు ఓటర్లకు గాలం వేస్తున్నారు. మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. వారి కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. దేశానికి కాబోయే ప్రధాని ఎవరో డిసైడ్ చేసేశారు కూడా. ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
వచ్చే లోక్ సభ ఎన్నికల అనంతరం కేసీఆర్ ప్రధానమంత్రి కుర్చీలో కుర్చుంటే బాగుంటుందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. దేశానికి ప్రధానమంత్రి కాగల లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయని అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆయన చేవెళ్ల లోక్ సభ పరిధిలో పర్యటించారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, బూత్ ఇన్ ఛార్జీలతో సమావేశమయ్యారు. ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటైన కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కూటమికి కేసీఆర్ నాయకత్వం వహించాలని అకాంక్షించారు. కేసీఆర్ ను ప్రధానమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.
డిక్టేటర్ మినిస్టర్ ఎర్రబెల్లి .. ప్రజలకు, ప్రతిపక్షాలకు వార్నింగ్ లు ఇస్తూ హల్ చల్
నరేంద్ర మోడీ గానీ రాహుల్ గాంధీ గానీ ప్రధాని పదవికి తగరని ఒవైసీ వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీల నాయకులు కావడం వల్లే వారు ప్రధాని పదవులకు అనర్హులని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహించే సీనియర్లే ప్రధానమంత్రులకు సరైన అభ్యర్థులని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ 16 లోక్ సభ స్థానాలు సాధించగలిగితే.. జాతీయ స్థాయిలో ఆ పార్టీ అత్యంత కీలకంగా మారుతుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ల ప్రభుత్వాలు కేంద్రంలో ఏర్పడకుండా అడ్డుకునే శక్తి, సామర్థ్యాలు టీఆర్ఎస్ కు ఉన్నట్లు పేర్కొన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ఒవైసీ అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వారే ప్రధాని స్థానంలో కూర్చోవాలని అన్నారు. సోదర భావాన్ని, లౌకిక వాదాన్ని పరిరక్షించే లక్షణాలు కేసీఆర్ లో ఉన్నాయని చెప్పారు.