కదలండి! మీదే బాధ్యత: 105మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో రానున్న ముందస్తు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో గురువారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమయ్యారు.
ప్రజల్లోకి వెళ్లండి..
తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో మెనిఫెస్టో కమిటీ త్వరలోనే పార్టీకి సంబంధించిన మెనిఫెస్టోను అందజేస్తుందని తెలిపారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని దాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని కేసీఆర్ సూచించారు.
ముందస్తు ఎన్నికలు: కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే
క్యాంపు కార్యాలయాలు ఖాళీ చేయండి..
టికెట్ వచ్చిందని గర్వపడొద్దని సూచించారు. రేపటి(శుక్రవారం) నుంచి ప్రజల్లోకి వెళ్లాలని, వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేయాలని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
వారి బాధ్యత మీదే..
నియోజక వర్గంలోని అన్నిస్థాయిల్లో నేతలను కలుపుకోవాలన్నారు. ప్రతీ నియోజక వర్గానికి వస్తానని, ఒక్కో రోజు రెండు మూడు నియోజక వర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు. అసంతృప్తి నేతలుంటే ఎమ్మెల్యే అభ్యర్థులే బుజ్జగించాలని సూచించారు. మరో సమావేశంలో కలుద్దామని అభ్యర్థులకు కేసీఆర్ చెప్పారు.
హుస్నాబాద్ సభతో ప్రచారం ప్రారంభం...
కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హుస్నాబాద్ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్. ఈ సభ కోసం భారీ సంఖ్యలో ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. హరీశ్ రావు దగ్గరుండి ఈ సభ ఏర్పాట్లను చూసుకుంటున్నారు.