మోడీ భేటీలోనే సిగ్నల్: కేసీఆర్ ముందస్తు సవాల్, ఫాంహౌస్లో వ్యూహాలు, విజయసాయిదీ అదే మాట
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ముందస్తు ఎన్నికలకు సై అన్నారు. తద్వారా ముందస్తుకు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా ముందస్తు సంకేతాలు ఇచ్చారా? అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారా? అనే చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్, వైసీపీ నేతలు కుడా ముందస్తు అంటున్నారు.
ఏపీలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చునని, సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అంతకుముందు అన్నారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ కమిటీల్లో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని తెలంగాణలో కాంగ్రెస్ నేతలు, వైసీపీ, బీజేపీ ఒక్కటేనని ఏపీలో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్, విజయసాయిరెడ్డిల ముందస్తు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే, అంతకుముందు నుంచే కాంగ్రెస్ కూడా చెబుతోంది.
సర్వేతో పార్టీ నేతలకు హెచ్చరిక
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ అద్భుత విజయం సాధిస్తుందని కేసీఆర్ ఆదివారం చెప్పారు. అంతేకాదు, త్వరలో ఇందుకు సంబంధించిన సర్వే బయట పెట్టనున్నట్లు చెప్పారు. తద్వారా పార్టీలో పనితీరు బాగా లేని నేతలకు సర్వేతో హెచ్చరికలను పంపనున్నారు. దీంతోనే పార్టీ నేతలకు ముందస్తు సిగ్నల్స్ ఇవ్వనున్నారని అంటున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలతో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు రావొచ్చునని భావిస్తున్నారు.
కేసీఆర్ ధీమా
ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ 100 సీట్లలో 50 శాతానికి పైగా ఓట్లతో గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సగం కంటే ఎక్కువ మంది 50వేల మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పారు. 82 సీట్లలో 60 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని కేసీఆర్ చెబుతున్నారు. వందసీట్లలో గెలుస్తామనే ధీమా కేసీఆర్లో కనిపిస్తోంది.
ప్రధాని మోడీతో భేటీలో ముందస్తు చర్చ, వారంగా ఫాంహౌస్లో చర్చ
కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలోనే ముందస్తు అంశంపై చర్చ జరిగి ఉందని భావిస్తున్నారు. ఆయన తిరిగి వచ్చాక పాంహౌస్కే ఎక్కువగా పరిమితం అయ్యారని అంటున్నారు. ఈ వారం రోజుల పాటు ముందస్తుపై చర్చలు, వ్యూహాలు రచించి ఉంటారని భావిస్తున్నారు. ప్రధానితో భేటీలోనే ముందస్తు సిగ్నల్స్ అందడంతో కేసీఆర్ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారని భావిస్తున్నారు.
ఎన్నికల సంఘాన్ని అడుగుతానంటూ..
ఢిల్లీ నుంచి వచ్చాక కేసీఆర్ ముందస్తుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని భావిస్తున్నారు. ఎవరైనా పార్టీలో చేరినప్పుడు ఎప్పుడు విపక్షాలపై గట్టి పంచ్లు విసురుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముందస్తుపై సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు ముందస్తు గురించి మాట్లాడటాన్ని ఉద్దేశించి.. ముందస్తుకు మీరు సిద్ధమా, నేను ఎన్నికల సంఘాన్ని అడుగుతానని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. కాగా, అంతకుముందే పార్టీ నేతలతోను కేసీఆర్.. ఎన్నికలు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉంటాయని చెప్పారని తెలుస్తోంది.