'నాడు ఎన్టీఆర్, నేడు కేసీఆర్.. ప్రతి తెలుగోడు మద్దతివ్వాలి, కేసీఆర్తో హోదా.. బాబు మద్దతివ్వాలి'
Recommended Video
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడబోయే థర్డ్ ఫ్రంట్కు నాయకత్వం వహించే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్కే వంద శాతం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
ఇలాంటి సమయంలో తెలుగు వారంతా కేసీఆర్కు అండగా నిలవాలన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తెలుగువాణిని ఢిల్లీలో ఎలుగెత్తి చాటారని, ఇప్పుడు కేసీఆర్ మళ్లీ అదే చేయబోతున్నారని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై ఓ రకమైన వివక్ష, ఏపీపై మరో రకమైన వివక్ష చూపుతోందన్నారు.
భయం.. భయం!: 2019 బిగ్ ప్లాన్, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వెనుక అసలు కథ ఇదీ!!
చంద్రబాబు మూడో కూటమిలోకి రావాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా కోరుతున్నప్పటికీ కేంద్రం ఇవ్వడం లేదని కడియం అన్నారు. కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు. థర్డ్ ఫ్రంట్ ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చునని, కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా మూడో కూటమిలోకి రావాలన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ విఫలం
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ అవినీతి, అక్రమాలలో కూరుకుపోతే, బీజేపీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని, పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు.
మోడీ గుర్తించడం లేదు
క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం, వ్యవస్థలో లోపాలను ప్రధాని మోడీ గుర్తించడం లేదన్నారు. ఆర్థిక నేరగాళ్లను అదుపు చేయడంతో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ పరిస్థితి పోయి ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో థర్డ్ ఫ్రంట్ రావాలని ఆకాంక్షించారు.
అన్నీ తెలిసిన కేసీఆర్
దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు క్షుణ్ణంగా తెలిసిన కేసీఆర్ థర్డ్ ఫ్రంట్కు నాయకత్వం వహించగలన్నారు. వామపక్షాలు కూడా తమ అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
మోడీ స్పందించాలని కవిత
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్లమెంటులో రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఎంపీలు, విభజన చట్టం హామీలపై ఏపీ సభ్యులు నిరసన తెలిపారని చెప్పారు. తమిళనాడు సభ్యులు కావేరీ జలాల వివాదంపై నిరసన తెలిపారన్నారు. వీటిపై మోడీ స్పందించాలన్నారు.
కేసీఆర్ ప్లాన్ ఇదే
కాగా, థర్డ్ ఫ్రంట్ పైన కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలుత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తదితర విశ్రాంత అఖిల భారత స్థాయి అధికారులతో సమావేశమవుతారు. జాతీయ స్థాయిలోనూ, వివిధ రాష్ట్రాలలోనూ ఏళ్ల తరబడి ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం, అనేక రాజకీయ పరిణామాలను చూసిన అనుభవమున్న అధికారులతో భేటీ ద్వారా దేశానికి అవసరమైన అజెండాను రూపొందించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. అనంతరం సైనిక, వాయు, వైమానిక శాఖల్లో పనిచేసిన విశ్రాంత రక్షణాధికారులు, ఇతర ఉద్యోగులతోనూ సమావేశమవుతారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ నిపుణులు, ప్రముఖ లాయర్లు, అఖిల భారత రైతు సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో కూడా సమావేశం అవుతారు. కేంద్ర ప్రభుత్వంలోనూ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ పనిచేసిన ఆర్థిక శాఖ కార్యదర్శులు, విశ్రాంత అధికారులు, ఆర్థిక వేత్తలతోనూ కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగ సంఘాలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా ఈ సమావేశాలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి.