కేసీఆర్ అనుకున్నదే చేస్తున్నారా .. రెవెన్యూ శాఖ పేరే కనుమరుగు కానుందా ?
Recommended Video
రెవెన్యూ శాఖలో కీలక మార్పులు జరగబోతున్నాయి. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా మార్చాలన్న నిర్ణయం మేరకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రెవెన్యూశాఖ పేరును భూరికార్డులు, యాజమాన్య నిర్వహణగా మార్చాలని నిపుణులు సూచించారు. కలెక్టర్ను జిల్లా పరిపాలకుడు, న్యాయాధిపతిగా పిలవాలని కోరారు. అంతే కాదు రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
విద్యార్థుల ఆత్మహత్యలపై వారం రోజుల తర్వాత స్పందిస్తారా కేసీఆర్ ..ఎంత దారుణం అన్న డీకే అరుణ
రెవెన్యూ శాఖ విషయంలో కేసీఆర్ అనుకున్నదే చేస్తున్నారు
సీఎం కేసీఆర్ తాను అనుకున్నదే చేస్తారు. ఎవరు ఏం చెప్పినా , ఆయన మాత్రం అవేవీ పట్టించుకోకుండా పని చేసుకుపోతారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే రెవెన్యూ శాఖ విషయంలో కూడా ఇదే జరుగుతుందా అనిపిస్తుంది . రెవెన్యూ శాఖలో అవినీతి విషయంలో స్పందించిన కేసీఆర్ రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ శాఖను సంబంధిత శాఖల్లో విలీనం చేస్తామని ప్రకటించారు. ఇక సీఎం ప్రకటనతో రెవెన్యూ ఉద్యోగులు అదే జరిగితే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. అయినా కేసీఆర్ అవేవీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతున్నారు.
రెవెన్యూలో మార్పులకు సిఫార్సు చేసిన ఉన్నత స్థాయి కమిటీ
కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలపై ప్రభుత్వ కసరత్తులో భాగంగా ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్ . ఈ కమిటీ పలు ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఈ కమిటీ రెవెన్యూశాఖకు సంబంధించి కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూశాఖకు సంబంధించిన పలు విధులను పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలకు బదిలీ చేయాలని నిర్దేశించారు. అంతే కాదు రెవెన్యూ శాఖకు, కలెక్టర్ కు పేర్లు మార్పు చెయ్యాలని సైతం సూచించారు.
పేర్ల మారుతో పాటు రెవెన్యూ శాఖలో విధులను ఇతర శాఖలకు అప్పగించే ప్రపోజల్
బ్రిటిష్ కాలంలో పెట్టిన పేర్లైన రెవెన్యూ, కలెక్టర్ పేర్లకు బదులుగా భూ రికార్డులు, యాజమాన్య నిర్వహణ శాఖగా పేరు మార్పు చెయ్యాలని సూచించారు. అలాగే కలెక్టర్ అన్న పేరుకు బదులుగా జిల్లా పరిపాలకుడు, న్యాయాధిపతిగా పేర్లు మార్పు చెయ్యాలని సూచించారు. అందుకు కారణం లేకపోలేదు. బ్రిటిష్ కాలంలో భూముల మీద శిస్తు విధానం అమలులో వుండేది కాబట్టి అప్పుడు రెవెన్యూ శాఖగా, శిస్తు వసూలు చేసిన అధికారిని కలెక్టర్ గా పిలిచేవారు. కానీ ఇప్పుడు శిస్తు వసూలు చేసే విధానం లేదు కాబట్టి ఆ పేర్లను మార్చాలని సీఎం సూచించారు. ఇటీవల రెవెన్యూశాఖలో మార్పులకు పూనుకున్న కేసీఆర్ మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేశారు.దీనిని దృష్టిలో పెట్టుకొని పేర్ల మార్పిడి జరగాలని సీఎం భావించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఉన్నత స్థాయి కమిటీ ?
సీఎం సూచనల మేరకు కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలపై అధ్యయనం చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెవెన్యూశాఖ పేరు మార్పిడితో పాటు ఆ శాఖకు గల పలు అధికారాలను ఇతర శాఖలకు బదలాయించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి వచ్చింది. ధ్రువీకరణపత్రాల జారీ వంటివి పంచాయతీరాజ్ శాఖకు అప్పగించాలని, భూరికార్డుల నిర్వహణ వంటివి వ్యవసాయ శాఖకు ఇవ్వాలనే సూచనలు చేసినట్లు తెలిసింది. ఇదే జరిగితే రెవెన్యూ శాఖలో కేసీఆర్ అనుకున్నది చేసినట్టే అవుతుంది .