కేసీఆర్ నా గురువు: తిరుమలలో రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుపతి: దుబ్బాక ఉపఎన్నికలో విజేతగా నిలిచిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేంకటేశ్వరస్వామికి తలనీలాలు సమర్పించిన ఆయన.. స్వామివారిని దర్శించుకున్నారు. దుబ్బాక విజయం అనంతరం ఆయన నేరుగా శ్రీవారి దర్శనార్థం వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాటి నరేంద్రుని స్ఫూర్తిని నేటి నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారని అన్నారు. దుబ్బాక విజయం ప్రభావం తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణభారతం అంతా ఉంటుందన్నారు. ఇది దుబ్బాక ప్రజల విజయమని, వారి కోసం ప్రాణం పోయే వరకు కష్టపడతానని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఎలా ఆదేశిస్తే అలా సేవలందిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. విద్య నేర్పిన గురువుతో పోటీపడితే బాగుంటుందని, తాను గురువుగా భావించే కేసీఆర్ నుంచి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నానని అన్నారు. దుబ్బాక విజయం తన పార్టీ సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు. దుబ్బాక నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజాసేవ చేయాలనే తపనే ముఖ్యమంత్రి గడ్డపై తనను గెలిపించిందని రఘునందన్ రావు తెలిపారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇటీవల దుబ్బాకలో ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం ఉపఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1079 ఓట్లతో గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోలిపేట సుజాత రెండో స్థానానికి పరిమితమయ్యారు. మూడోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిలిచారు.