ఆంధ్ర ప్రజలపై కేసీఆర్ నమ్మకమేంటి...? ఏపీలో ఆ ఇద్దరికి క్రేజ్ ఉందా... ?
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గెలిచి చరిత్ర తిరగరాసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో తెలంగాణ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీలే ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననే వ్యాఖ్యలు చేసినప్పటినుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఏపీ రాజకీయాల్లో తమ జోక్యం ఉండబోతోందంటూ ఇటు గులాబీ బడా బాస్ కేసీఆర్ అటు టీఆర్ఎస్ జూనియర్ కేసీఆర్ (కేటీఆర్)లు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇంతకీ ఆంధ్రా ప్రజలపై వారు పెట్టుకున్న నమ్మకం ఏంటి...? వారు ఆంధ్ర రాజకీయాల్లో కలుగజేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి...?
వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)
కేసీఆర్ నాయకత్వానికి సీమాంధ్రుల మద్దతు
తెలంగాణ ఎన్నికల ప్రభావం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా చూపిస్తోంది. తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేయడం ఆ తర్వాత ఘోర పరాజయం మూటకట్టుకోవడం తెలిసిందే. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేశారు కనుక టీఆర్ఎస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందనే సంకేతాలను కేసీఆర్, కేటీఆర్ పంపుతున్నారు. హైదరాబాదులో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు మద్దతుగా నిలవడంపై వారు ఇప్పటికే ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే ఇక్కడ టీఆర్ఎస్ విజయానికి దోహదపడిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రా ప్రజలకు ఎలాంటి హాని టీఆర్ఎస్ పార్టీ నుంచి కలగకపోవడంతో ఏపీ ప్రజలు కేసీఆర్ను టీఆర్ఎస్ను ఆదరించారు. ఇందుకు ఉదాహరణ కూకట్ పల్లిలో దివంగత నేత హరికృష్ణ కూతురు సుహాసినిని నిలబెట్టినప్పటికీ ఆమెను ఆదరించలేదు. టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు కూకట్ పల్లి ప్రజలు.
రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)
నాడు ఎన్టీఆర్, వైయస్సార్ నుంచి నేడు కేసీఆర్ వరకు అభిమానం చాటిన తెలుగు ప్రజలు
తెలుగు ప్రజలు ఎప్పటికీ కార్యసాధకుడిని నమ్ముతారనేది ఎప్పటి నుంచో ఉంది. తమ గుండెల్లో పెట్టుకుని అలాంటి వారిని ఆదరిస్తారు. ఉదాహరణకు తీసుకుంటే నాడు ఎన్టీఆర్, మొన్నటివరకు వైయస్సార్, ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్. ఇలాంటి మహోన్నత వ్యక్తులను ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆదరించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ బాస్ కేసీఆర్, తనయుడు కేటీఆర్ల ధీమా కూడా ఇదే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్లో ప్రజలు తమను విశ్వసిస్తున్నారు కనకే అక్కడికెళ్లి ప్రచారం చేస్తామని చెబుతున్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపన సందర్భంగా కూడా వేదికపై మోడీ, చంద్రబాబులు ప్రసంగించినప్పటికీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ రాలేదు. అదే కేసీఆర్ మైకు అందుకుని ప్రసంగం మొదలు పెట్టగానే సభా ప్రాంగణం నుంచి కేరింతలు చప్పట్లు వినిపించాయి.
ఫెడరల్ ఫ్రంట్లో జగన్ పవన్లను కలుపుకుపోయే అవకాశం..?
చంద్రబాబు ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తిరిగి అబద్దాలను ప్రచారం చేశారని అయినప్పటికీ సీమాంధ్ర ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారంటే వారు కచ్చితంగా కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని కేటీఆర్ మీట్ దిప్రెస్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు కేసీఆర్కు ప్రధాన శత్రువు కాంగ్రెస్. ఆ కాంగ్రెస్తో చంద్రబాబు జతకట్టి రాజకీయాలు చేశారు. దేశంలో గుణాత్మకమైన మార్పుకోసం చేసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఇటు కాంగ్రెస్ అటు చంద్రబాబులను ఎండగట్టే ప్రయత్నం చేసే యోచనలో తండ్రీ కొడుకులు ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఏపీలో వైసీపీకి ప్రత్యర్థి టీడీపీ కాంగ్రెస్లు. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జగన్ను కలుపుకుని పోయే అవకాశాలున్నాయి. అంతేకాదు జగన్, పవన్ కళ్యాణ్లు తమకు శతృవులు కాదంటూ కేటీఆర్ పరోక్ష మద్దతు తెలిపారు. అదే జరిగితే కేటీఆర్ అన్నట్లు 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ నామమాత్ర పార్టీగానే మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారడంతో పాటు ఏపీలో రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ టీడీపీ పొత్తును ఇటు రెండు పార్టీల క్యాడర్ జీర్ణించుకోలేకున్నాయి. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో 2019 ఎన్నికల సమయానికి కాంగ్రెస్, టీడీపీలోని కీలక నేతలు పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే ఆ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలకు ప్రజలు గుడ్బై చెబుతారంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.