వారి మోసంతో కన్నీళ్లు పెట్టుకున్న! లక్షమంది ఉత్తమ్లైనా ఆపలేరు: కేసీఆర్
హైదరాబాద్: సమైక్య పాలకులు, కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమైక్య పాలనలో, తెలంగాణ కాంగ్రెస్ నేతల హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు దగాపడ్డాయని అన్నారు. రాష్ట్రం ఏర్పాటైతే సూర్యాపేటను జిల్లా చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని గుర్తుచేశారు.
లక్షమంది ఉత్తమ్లు వచ్చిన..
సూర్యాపేటలో జిల్లా సమీకృత కార్యాలయాల భవనాలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లక్షమంది ఉత్తమ్ కుమార్రెడ్డిలు అడ్డుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి పూర్వ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
సమైక్యవాదుల మోసం..
నాగార్జున సాగర్ అసలు పేరు నందికొండని తెలిపారు. ప్రాజెక్ట్ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా 19 కిలోమీటర్ల ఎగువన ఏళేశ్వరం వద్ద నిర్మించాల్సిఉండేనని చెప్పారు. ఏలేశ్వరం వద్ద ప్రాజెక్టు కడితే నల్గొండ జిల్లాలో 10లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవన్నారు. సమైక్యవాదులు ఆనాడు మోసం చేసి ప్రాజెక్టును దిగువన నిర్మించారని అన్నారు. దీంతో పాలమూరు, నల్లగొండ జిల్లాల ప్రజలకు త్రాగునీరు, భూములకు సాగునీరు కరువైందని చెప్పారు.
కన్నీళ్లు పెట్టుకున్న..
ఈ నేపథ్యంలోనే అనివార్యంగా ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య తలెత్తిందన్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఫ్లోరైడ్ యాత్ర చేపట్టినట్లుగా తెలిపారు. మునుగోడు, దేవరకొండ వంటి ప్రాంతాలను సందర్శించినప్పుడు కొన్నిచోట్ల కన్నీరు పెట్టుకున్నట్లు కేసీఆర్ తెలిపారు.
అప్పుడు పాదయాత్ర చేశా.. కాంగ్రెస్ ఏం చేసింది?
‘నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కుడి, ఎడమ కాల్వలు ఉన్నాయి. ఇరు కాల్వల మీద లిఫ్ట్లు ఉన్నాయి. కుడి కాల్వ మీద ఉన్న లిఫ్ట్ల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించేది. కాగా ఎడమకాల్వ మీద ఉన్న లిఫ్ట్ల నిర్వహణ ఖర్చులను రైతుల వద్ద వసూలు చేసేవారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎడమకాల్వ రైతుల హక్కుల కోసం కోదాడ నుంచి హాలియ వరకు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. దీంతో అప్పటి ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఎడమకాల్వ లిఫ్ట్ల నిర్వహణను కూడా తామే చూస్తామని ప్రకటించింది' అని కేసీఆర్ చెప్పారు. అనాడుగానీ, ఈనాడుగానీ ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చేసిందేమీ లేదని సీఎం పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదు..
వైయస్ హయాంలో పోతిరెడ్డిపాడు వద్ద 65వేల క్యూసెక్కుల కాలువ తవ్వితే కాంగ్రెస్ నేతలు నోరు తెరవలేదని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతల నోళ్లు అప్పుడు మూడపడ్డాయా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. పాలేరు భగీరథుడు తుమ్మల అని అన్నారు.
సూర్యాపేటకు వరాలు
ఈ సందర్భంగా సూర్యాపేటకు కేసీఆర్ వరాలు జల్లు కురిపించారు. వచ్చే బడ్జెట్లో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మెడికల్ కళాశాలలను మంజూరు చేస్తామన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.15లక్షలు, తండాకు రూ.10లక్షలు కేటాయిస్తామన్నారు. సూర్యాపేటలో బంజారా భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పెంచాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట అభివృద్ధికి రూ.75కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.