కెసిఆర్ భూమిపూజ: అమ్మవారికి 60లక్షల బంగారు కిరీటం, జగన్కు కెసిఆర్ కౌంటర్
కరీంనగర్: జిల్లాలోని మహదేదవపూర్ మండలం కాళేశ్వరంలో కొలువై ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దంపతులు భారీ కానుక అందజేశారు.
సతీసమేతంగా ఆదివారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్.. సోమవారం ఉదయమే జిల్లాలోని మహదేవ్ పూర్ మండలంలోని కాళేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ దంపతులు రూ.60 లక్షలతో చేయించిన బంగారు కిరీటాన్ని శుభానందాదేవికి సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే కిలోన్నర బంగారంతో కాళేశ్వరం సన్నిధిలోని శుభానందా దేవికి స్వర్ణ కిరీటాన్ని సమర్పిస్తానని 2012లో మొక్కిన కేసీఆర్.. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కాళేశ్వర క్షేత్రానికి నేడు వచ్చిన సందర్భంగా ఆ మొక్కును చెల్లించుకున్నారు.
ఆ తర్వాత కన్నెపల్లి వద్ద కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌజ్కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ కాళేశ్వరం వచ్చి అక్కడి నుంచి అంబటిపల్లికి చేరుకుంటారు. అక్కడ మేడిగడ్డ బ్యారేజికి శంకుస్థాపన చేయనున్నారు.
జగన్కు కెసిఆర్ కౌంటర్
మేడిగడ్డతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అవుతుందని కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓ నాలుక, ఏపీలో మరో నాలుక, మహారాష్ట్రలో ఇంకో నాలుక ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎందుకు ధర్నా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ఓ విధానం అంటూ లేదన్నారు.
మేడిగడ్డ నుంచి వంద టీఎంసీలు వరంగల్ జిల్లాకు ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకముందే పంప్ హౌస్ నుంచి నీరు తీసుకునేలా నిర్మాణం ఉంటుందని చెప్పారు. మహారాష్ట్రతో ఒప్పందం అయిన తర్వాత పూర్తిస్థాయి నిర్మాణం ఉంటుందని చెప్పారు.
మంత్రి హరీష్ రావు, పాలమూరు నేతలు కలిసి పాలమూరు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారన్నారు. పాలమూరు ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణకు లబ్ధి అన్నారు. తమ్మిడిహెట్టి ద్వారా అదిలాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం అయిందే మా కరువును, మా హక్కును, మా ప్రజల సాగునీటి, తాగునీటి గోస తీర్చేందుకని కేసిఆర్ అన్నారు. భూకంపాలు వచ్చినా సరే 1300 టీఎంసీల నీటిని మేం వాడుకుంటామని వైసిపి అధినేత జగన్ను ఉద్దేశించి అన్నారు. ఈ నీటి పైన పిచ్చి ఆలోచనలకు పోవద్దని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి ఏపీ నియమనిబంధనల ప్రకారమే మేం కృష్ణా, గోదావరి నదుల నుంచి 1300 టీఎంసీల నీటిని వాడుకునేందుకు సమాయత్తమయ్యామని చెప్పారు. కానీ ఏపీలో కొన్ని రాజకీయ పక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని జగన్, ఇతర నేతలను ఉద్దేశించి అన్నారు.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఏడు జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు అందుబాటులోకి రానున్నాయి. పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు సమకూరనున్నాయి. రూ. 84 వేల కోట్ల వ్యయంతో మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రాణహిత - చేవెళ్ల నమూనా మార్పుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపారంతరం చెందింది.