గట్టు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన కేసీఆర్: గద్వాలపై వరాలజల్లు
గద్వాల: గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ. 553.98 కోట్ల అంచనా వ్యయంతో 33 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో చేపడుతున్న ఈ పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గద్వాలపై కేసీఆర్ వరాల జల్లు
గట్టు ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు గద్వాలకు వచ్చిన సీఎం కేసీఆర్ అక్కడి ప్రజలకు వరాల జల్లు కురిపించారు. నడిగట్ట ప్రగతి సభలో ప్రసంగిస్తూ.. అక్కడి సమస్యలను ప్రస్తావిస్తూనే వరాలు కురిపించారు. గద్వాల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారుస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకు తక్షణమే ఆదేశాలు జారీచేయనున్నట్టు వెల్లడించారు.
100కోట్లతో గద్వాల అభివృద్ధి
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.100 కోట్లు ప్రత్యేకంగా మంజూరుచేస్తూ రేపు ఆదేశాలు జారీచేస్తామన్నారు. గద్వాల కొత్త జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. అలాగే, ఈ రోజు సీఎం ప్రారంభించిన గట్టు ఎత్తిపోతల పథకానికి అక్కడి ప్రజల కోరిక ప్రకారం చరిత్రకారుడు నల్లా శోమనాద్రి గట్టు ఎత్తిపోతలప థకం అనే పేరును అధికారికంగా పెడతామని స్పష్టంచేశారు. గట్టులో ఓ రెసిడెన్షియల్ పాఠశాల కావాలని నేతలు కోరగా అందుకు సీఎం సుముఖత వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం , గిరిజనులు, దళితులు, బీసీలకు 560 వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని, అవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నట్టు కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై 1.20లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నట్టు వివరించారు.
అదనంగా 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు
రాష్ట్రంలో బీసీల సంఖ్య అధికంగా ఉండటంతో ఇంకా అలాంటి పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన కోరిక ప్రకారం 584 మండలాలకు గాను కచ్చితంగా ప్రతి మండలానికి బీసీ గురుకుల పాఠశాల రావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో మళ్లీ 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్కు వెళ్లాక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి వాటికి ఆమోద ముద్ర వేస్తామని అన్నారు. గట్టుకు కూడా కచ్చితంగా ఓ పాఠశాల మంజూరవుతుందని హామీ ఇచ్చారు. అలాగే కొత్తగా ఏర్పడిన కేటీ దొడ్డి మండల కేంద్రంలో గిరిజనులు ఎక్కువ మంది ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా గిరిజన గురుకులపాఠశాల మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
Recommended Video
గుర్రంగడ్డ వంతెన సాకారం
గుర్రంగడ్డ వంతెన గురించి రాస్తే రామాయణమంత.. చెబితే భారతమంత అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎప్పటినుంచో ఆ వంతెన నిర్మాణం పెండింగ్లో ఉందని చెప్పారు. ఈ రోజు తాను ఆ ప్రాంతాన్ని హెలీకాప్టర్ ద్వారా చూసినట్టు చెప్పారు. ఆ వంతెన నిర్మాణం కోసం రూ.8 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెప్పారని, రూ.8 కోట్లు కాదు.. 10 కోట్లు అయినా సరే శనివారం సాయంత్రం లోపే వంతెన నిర్మాణానికి జీవో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి నాలుగైదు నెలల్లోనే పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. గద్వాల బస్టాండ్ ఆధునికీకరణకు రూ.2 కోట్లు తన నిధుల నుంచి మంజూరు చేస్తానన్నారు. అలాగే, జూరాల డ్యాం వద్ద బృందావనం ఏర్పాటు చేయాలని అక్కడి నేతలు కోరగా.. స్పందించిన సీఎం కేసీఆర్.. సీఎం నిధుల నుంచి రూ.15 కోట్లు కేటాయించి అద్భుతమైన పార్కును నిర్మించి దాన్నో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. పాలమూరును అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఇతర ప్రాంతాల వారే ఇక్కడికి వచ్చి పనులు చేసుకునేలా చేస్తామని కేసీఆర్ చెప్పారు. గత పాలకులు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేస్తారని మండిపడ్డారు.