అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారు?: కలిసొచ్చే ‘6’కే కేసీఆర్ ఫిక్స్, ఎమ్మెల్యేలకు మంత్రుల ఫోన్లు!
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
అసెంబ్లీ రద్దుకు 6నే మూహూర్తం
సెప్టెంబర్ 6న ఉదయం 6.45 గంటలకు తెలంగాణ మంత్రి వర్గం సమావేశమై అసెంబ్లీ రద్దుకి సిఫార్సు చేయనుందని తెలుస్తోంది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ ని కలిసి అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి లేఖ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
Recommended Video
కేసీఆర్కు ‘6' సెంటిమెంటు..
కేసీఆర్కు ‘6' అనే అంకె కలిసి వచ్చేదిగా సమాచారం. అందుకే ఆరోజే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేగాక, ఆ రోజు ఏకాదశి ఉండగానే అసెంబ్లీని రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే 6న ఉదయం 6.45నిమిషాలకే అసెంబ్లీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కేసీఆర్కు ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేలకు మంత్రుల ఫోన్..
కాగా, ‘తెలంగాణ'లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు మంత్రులు ఫోన్ కాల్స్ చేసినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాలలో పెండింగ్ లో ఉన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను రేపు, ఎల్లుండి లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేలందరూ ఎల్లుండి ఉదయం హైదరాబాదులో అందుబాటులో ఉండాలని మంత్రులు ఆదేశించినట్టు తెలుస్తోంది.
మళ్లీ కేసీఆరేనంటూ కేంద్రమంత్రి సంచలనం
ఇది ఇలావుంటే, తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ చెబుతున్న తరుణంలో కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గెలవడం, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని అన్నారు. కామారెడ్డిలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పేదలకు, రైతులకు, దళితులకు, మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో పాటుపడుతున్నారని మంత్రి ప్రశంసించారు.