హుజూర్ నగర్ లో ఈసారి గులాబీ పార్టీ గురి తప్పదా..? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..?
హైదరాబాద్ : హుజూర్ నగర్ ఉప ఎన్నికపై అదికార గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. గత సాధారణ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయిన టిఆర్ఎస్ తాజాగా జరగబోవు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎవరి చేతిలోనైతే ఓటమి చవి చూసామో అదే పార్టీ అభ్యర్దిని చిత్తుగా ఓడించేందుకు వ్యూహాత్మక అడుగులు చేస్తోంది అదికార గులాబీ పార్టీ. అందుకోసం సీఎం చంద్రశేఖర్ రావు స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం తో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రదచారంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. గులాబీ అభ్యర్ది సైదిరెడ్డి గెలుపుకోసం మైక్రోస్కోపిక్ ప్రికాషన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్టు గులాబీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి.
హుజూర్ నగర్ ఉప పోరుపై కేసీఆర్ ఫోకస్.. గులాబీ శ్రేణులను రంగంలోకి దించిన బాస్..
తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ లో జెండా ఎగుర వేసేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకోసం ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావే స్వయంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థులకు అంతుచిక్కని విధంగా ప్రణాళికలు రచిస్తూ, గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. కాంగ్రెస్ ఆదిపత్యాన్ని తోసిరాజంటూ ఈసారి నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగురవేయాలని పార్టీ పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హుజూర్నగర్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ అధినేత, సీఎం చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలనే కృతినిశ్చయంతో ఉన్న చంద్రశేఖర్ రావు, ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు.
మంత్రులు హరీష్, కేటీఆర్ పర్యవేక్షణ.. గెలుపే లక్ష్యంగా కార్యాచరణ..
మున్సిపల్ శాఖా మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, పార్టీ ఇన్చార్జిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హుజూర్నగర్ ఉప ఎన్నిక ఇన్చార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హుజూర్నగర్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని, ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఎన్నికల వ్యూహంపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అయితే క్రియాశీలంగా ఉండే ఇన్చార్జిల జాబితాలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు.
60 మందికి గెలుపు బాద్యత.. ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న గులాబీ దళం..
ఒకరు ఇద్దరు కాకుండా పెద్ద ఎత్తున మొత్తం అరవై మంది ఇన్చార్జిలకు మండలాలు, సామాజిక వర్గాల వారిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు లేని మంత్రులు, ఎమ్మెల్యేలంతా హుజూర్నగర్ బాట పట్టారు. సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్తో పాటు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రవీంద్ర నాయక్ తదితరులకు నూతన జాబితాలో స్థానం కల్పించారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఓటర్లకు చేరువయ్యేందుకు సామాజిక వర్గాలవారిగా మద్దతు కూడగట్టుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
కాంగ్రెస్ ను ఓడించాలి... సత్తా చాటాలంటున్న సీఎం..
నియోజకవర్గంలోని బలమైన కమ్మ సామాజిక వర్గం ఓటర్లను దృష్టి పెట్టుకుని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్తోపాటు ఎమ్మెల్యేలు భాస్కర్రావు, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ను హుజూర్నగర్ ప్రచార రంగంలోకి దించబోతున్నారు చంద్రశేఖర్ రావు. వీరందరినీ సమన్వయం చేసే బాధ్యతను నియోజకవర్గ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించారు. మొత్తానికి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రతివ్యూహాలు రచిస్తుందో అనే అంశంపై ఆసక్తి నెలకొంది. నువ్వా నేనా అనే రేంజ్ లో సాగుతున్న హుజూర్ నగర్ ఉప పోరులో ఎవరిదిపై చేయి అవుతుందో చూడాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.