కేసీఆర్కు రివర్స్!: తెలంగాణలో 5 లోకసభ స్థానాలు కాంగ్రెస్కే, తెరాసకు ఎన్ని సీట్లు అంటే?
హైదరాబాద్/న్యూఢిల్లీ: టైమ్స్ నౌ - వీఎంఆర్ ప్రీపోల్ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు 11 నుంచి 12 సీట్లు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 5 సీట్లు వస్తాయని తేలింది. యూపీఏ అని చెప్పినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఈ మేరకు సర్వే ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి.
తెలంగాణలో కాంగ్రెస్కు కొత్త ఊపు
టైమ్స్ నౌ సర్వే ప్రకారం యూపీఏకు 5 లోకసభ సీట్లు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వస్తాయని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ లోకసభ నియోజకవర్గాన్ని మజ్లిస్ పార్టీ ఖాయంగా గెలుచుకుంటుందనేది తెరాస మాటే. ఈ లెక్కన.. ఈ సర్వే ఫలితాలు చూస్తే తెరాస 11 స్థానాల్లో గెలుస్తుందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న సికింద్రాబాద్ స్థానాన్ని మళ్లీ అదే పార్టీ గెలుచుకుంటే తెరాస 10 సీట్లకే పరిమితం అవుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తెరాస
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఏకపక్ష విజయం సాధించింది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 88 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత ఇద్దరు స్వతంత్రులు తెరాసలో చేరారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
తెరాసకు రివర్స్ అవుతుందా?
అయితే, పంచాయతీ ఎన్నికల్లో తెరాసకు కాస్త రివర్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ మంది సర్పంచ్లుగా గెలిచారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మిగతా 16 సీట్లు తమ పార్టీ గెలుచుకుంటుందని తెరాస నేతలు చెబుతున్నారు. కానీ ప్రీపోల్ సర్వే ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.