మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు!: డీజీపీ-న్యాయశాఖ అధికారులతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఓటుకు నోటు అంశం మరోసారి తెరపైకి వస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడుగులు చూస్తోంటే అలాగే కనిపిస్తోందనే వాదనలు మీడియాలో వినిపిస్తున్నాయి.
కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఏసీబీ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఓటుకు నోటు కేసుపై కూడా సమీక్షించారు. ఈ కేసు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచంద్ర రావు, ఏసీబీ రిటైర్డ్ డీజీ ఏకే ఖాన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
'దటీజ్ పవన్ కళ్యాణ్! 2019లో కింగ్ మేకర్, అభిమానులతోనే ప్రమాదం!!'
కేసీఆర్ ఆదివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సోమవారం పోలీసు ఉన్నతాధికారులతో, న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు పురోగతిపై, అలాగే, ఫోరెన్సిక్ నివేదికపై చర్చించారని తెలుస్తోంది.
మూడేళ్ల క్రితం ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం తెలిసిందే. అప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ నేతలు నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు ఇవ్వజూపారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఇందుకు సంబంధించి ఆడియో, వీడియోలు బయటపడ్డాయి. దీనిపై విచారణ జరుగుతోంది.