ప్రధానితో కేసీఆర్ భేటీ..! పలు వినతి పత్రాలు అందచేత..!మరి రిజర్వేషన్ల ప్రస్థావన మాటేంటి..?
Recommended Video
ఢిల్లీ/ హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భువనేశ్వర్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో భేటీ ఐన కేసీఆర్ ఆ తర్వాత ఢిల్లీ వెళ్లారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేని కూటమి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు కేసీఆర్ చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు.
ప్రధానితో కేసీఆర్ భేటీ..! పలు కీలక అంశాల పట్ల వినతులు..!
రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారిగా కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి అందచేశారు. నూతన సచివాలయం నిర్మాణం కోసం బైసన్ పోలో గ్రౌండ్ ను అప్పగించాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా మొదలగు అంశాల పట్ల లోతుగా చర్చించినట్టు తెలుస్తోంది.
విభజన చట్టంలో ని అంశాల ప్రస్థావన..! అమలు చేయాలని విన్నపం..!
అంతే కాకుండా కరీంనగర్ లో త్రిబుల్ ఐటీ, హైదరాబాద్ ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాలు, అదిలాబాద్ లో సీసీఐ పునరుద్దరణ, జహీరాబాద్ నిమ్జ్ కు నిధులు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు అభివృద్ధికి 1 వేయి కోట్లు, 9, 10వ షెడ్యూల్ లోని సమస్యలు పరిష్కారం, రైల్వే ప్రాజెక్టులు, షెడ్యూల్డు కులాల వర్గీకరణ, వరంగల్ లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, వెనకబడిన ప్రాంతాలకు 450 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు.
బీసి రిజర్వేషన్ల గురించే అందరి ఆసక్తి..! ప్రధానితో చర్చించారా..? లేదా..?
ఇంతవరకు బాగానే ఉన్నా రాష్ట్రంలో అత్యంత సమస్యత్మకంగా తయారైన బీసి రిజర్వేషన్ల గురించి ప్రధానితో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏవైనా చర్చలు జరిపారా అనే అంశం పై ఎత్కంఠ నెలకొంది. బీసి రిజర్వేషన్ల కోటా తేలిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ఏ మలుపు తిరుగుతిందోననే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే బీసి సంఘం నేతలు అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి తెస్తున్న విసయం తెలిసిందే.
బీసి రిజర్వేషన్ల తో పాటు ఇతర రిజర్వేషన్ల సంగతేంటి..?
హైకోర్టు తీర్పుతో 34శాతం ఉన్న బీసి రిజర్వేషన్ల కోటా 23శాతానికి పడిపోయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసి ప్రజానికం ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల పట్ల ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని బీసి సంఘాల నేతలు ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీని సంప్రదించిన నేపథ్యలో బీసి రిసర్వేషన్ల ప్రస్థావన గురించి చర్చ పట్ల బీసి నేతలు అత్రుతగా ఎదరుచూస్తున్నారు.అంతే కాకుండా ముస్లిం రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్ల గురించి కూడా చర్చించారో లేదనే చర్చ జరుగుతోంది. చంద్ర శేఖర్ రావు ప్రతిపాదించిన పదహారు అంశాల్లో ఈ రిజర్వేషన్ లకు సంబందించి సమాచారం ఎక్కడా లేకపోవడం గమనార్హం. మరి ఈ రిజర్వేషన్ల గురించి మౌఖికంగా ఏదైనా చర్చ జరిగిందోమో తేలాల్సి ఉంది. కాని ముఖ్యమంత్రి ప్రధానితో రిజర్వేషన్ల గురించి ప్రస్థావించారో లేదో ఆయన నోరు తెరిస్తేగాని స్పష్టత వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.