అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి కేసీఆర్, అక్కడే మధ్యాహ్న భోజనం: జాతీయ రాజకీయాలపై చర్చ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఆదివారం ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో కేసీఆర్ సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలతోపాటు పలు అంశాలపై చర్చలు జరిపారు. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన కేసీఆర్.. కాసేపు ముచ్చటించి అక్కడే భోజనం చేశారు.
అనంతరం జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తిపై ఇరువురు నేతల ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై ఇరువురు సీఎంలు చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి చండీగఢ్ కేసీఆర్, కేజ్రీవాల్ బయల్దేరారు. సాగుచట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను సీఎంలు పరామర్శించనున్నారు.
చండీగఢ్లో రైతులు, సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కులు ఇవ్వనున్నారు. 600 వందల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటుగా పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్ పాల్గొననున్నారు. చండీగఢ్లోని ఠాగూర్ థియేటర్లో జరగనున్న ఈ కార్యక్రమంలో బాధిత రైతు కుటుంబాలతో పాటు స్థానిక నేతలు హాజరుకానున్నారు.
కాగా, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా రైతులు చేసిన ఉద్యమంలో 700 మంది అన్నదాతలు చనిపోయారు. ఇందులో 600 మంది రైతులు పంజాబ్కు చెందిన వారే ఉన్నారు. వారికి ఆదివారం సాయంత్రం కేసీఆర్ ఆర్థిక సాయం అందించనున్నారు. సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రోజు.. ఉద్యమంలో పోరాడి మృతిచెందిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులకు కేసీఆర్ ఆర్థిక సాయం అందించనున్నారు. ఇతర రాష్ట్రానికి చెందిన సీఎం.. పంజాబ్ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో సాయం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.