కేబినెట్లో మార్పులు!: గవర్నర్తో కెసిఆర్ భేటీ, '62వేల కోట్ల అప్పులు తెచ్చారు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు మధ్యాహ్నం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. గురువారం రాత్రి రెండున్నర గంటల పాటు గవర్నర్తో కెసిఆర్ సమావేశమైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం కెసిఆర్ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయవచ్చునని తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో కెసిఆర్, గవర్నర్ నరసింహన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
తెలంగాణను దివాళా రాష్ట్రంగా మారుస్తున్నారు: రమణ
మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను దివాళా తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం 16 నెలల్లోనే రూ.62వేల కోట్ల అప్పులు తెచ్చిందన్నారు. టిఆర్ఎస్ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు.
అందుకే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో మళ్లీ రామరాజ్యం తెస్తామన్నారు. కెసిఆర్ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేం లేదన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయన పాలన పైన తిరుగుబాటు చేస్తామన్నారు.
2019లో కాంగ్రెస్ పార్టీదే అధికారం: జగ్గారెడ్డి
2019లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం చెరుకు రైతు బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలకు కెసిఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. సీఎం నిర్లక్ష్యం వల్లే కరువు మండలాల నిర్ధారణ జరగడం లేదని ఆరోపించారు.