నోట్ల రద్దు, తెలంగాణకు భారీ నష్టం: ఇవీ కారణాలు.. కేసీఆర్ వెల్లడి (పిక్చర్స్)
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు భేటీ అయ్యారు. రాజ్ భవన్లో సీఎంతో పాటు, సీఎస్ రాజీవ్ శర్మ కూడా గవర్నర్ను కలిశారు. వివిధ అంశాలపై గవర్నర్తో చర్చించారు.
కాగా, రూ.500, రూ.1000 నోట్లు రద్దు నేపథ్యంలో పలు కీలక విషయాలు చర్చించేందుకు సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారని తెలుస్తోంది. నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్ర ఆదాయం రూ.2 వేల కోట్లు నష్టపోయే అవకాశముందని, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే అవకాశముందని వివరించారని తెలుస్తోంది.
కేంద్రం పన్నుల వాటాలో వేటు వేసిందని, నాలుగు శాతం అర్ధాంతరంగా తగ్గించారని, ఇలా దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిందని, పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణకు నెలకు రూ.2000 కోట్ల ఆదాయానికి గండిపడిందని చెప్పారని తెలుస్తోంది.
రోజుకు సుమారు మూడు వేల రిజిస్ట్రేషన్లు కావాల్సి ఉండగా బుధవారం 150, గురువారం 300 రిజిస్ట్రేషన్లే జరిగాయని, 2 లక్షల లోపు విలువైన వాహనాల కొనుగోళ్లు తగ్గాయని చెప్పారని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లు 90 శాతం పడిపోయింది.
రాష్ట్రంలోని పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కేసీఆర్ గవర్నర్కు వివరించారని సమాచారం. ప్రతి నెలా కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ఈ నెల 42 శాతం కోత విధించారు. తమకు ఆదాయం తగ్గిందని కేంద్రం నవంబర్ నుంచే కోత విధించడం రాష్ట్రాలకు తీవ్ర నష్టమని ఆయన పరిస్థితిని గవర్నర్కు వివరించారు.
జిహెచ్ఎంసి బంపర్ ఆఫర్
రూ.500, 1000 నోట్లను రద్దు చేయడంతో ఇబ్బంది పడుతున్న భాగ్యనగర్ వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) బంపరాఫర్ ప్రకటించింది. కేంద్రం రద్దు చేసిన పాత నోట్లతో ఆస్తిపన్ను చెల్లించవచ్చని ప్రకటించింది.
రేపటి నుంచి జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని పౌరసేవాకేంద్రాలు, మీ సేవ కేంద్రాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గం.ల వరకు అందుబాటులో ఉంటాయని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. బకాయిలతో పాటు వచ్చే అయిదేళ్లకు సంబంధించిన ఆస్తిపన్ను చెల్లింపులతో పాటు వాణిజ్య అనుమతులను కూడా రెన్యువల్ చేసుకోవచ్చన్నారు.
తెలంగాణకు నష్టం ఇలా
రూ.500, రూ. 1000 నోట్ల రద్దు వల్ల తెలంగాణకు నెలకు రూ.వేయి కోట్ల నుంచి రూ.రెండువేల కోట్ల మేరకు నష్టం జరుగుతుందని కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. రాష్ట్రంలో రోజూ మూడువేల స్థిరాస్తి లావాలేవీలు జరిగేవని, నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత బుధ, గురువారాల్లో చాలా తగ్గాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆదాయం పోయింది
భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా నెలకు రూ.320 కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు 90 శాతం తగ్గే ప్రమాదం ఏర్పడిందని గవర్నర్తో కేసీఆర్ చెప్పారు. రోజుకు 3 వేల చొప్పున మోటారు వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లతో భారీగా ఆదాయం వచ్చేదని, బుధ, గురువారాల్లో 1700, 1100 చొప్పున విక్రయాలు జరిగాయని, 50% ఆదాయం పడిపోయిందన్నారు.
ఆదాయం ఇలా తగ్గింది
ఎక్సైజ్, లగ్జరీ పన్ను తదితర రంగాల్లో కూడా ఆదాయం తగ్గుతుందని, రాష్ట్రంలో చిన్న వ్యాపారాలదే పెద్ద వాటా అని, నగదుతోనే ఎక్కువ లావాదేవీలు జరుగుతాయని, నగదు చలామణిపై ఆంక్షలు, పరిమితుల వల్ల ఇబ్బంది కలుగుతుందని కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. దీనికి కేంద్రం నుంచి ఎలాంటి మినహాయింపులు, సవరణలు వస్తాయో చూడాలని కేసీఆఱ్ అభిప్రాయపడినట్లు తెలిసింది.
అసంతృప్తి
కేంద్రం రాష్ట్రానికి చెల్లించాల్సిన పన్నుల వాటాను అర్ధాంతరంగా తగ్గించిందని గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్ను తగ్గింపు వల్ల రాష్ట్రానికి చాలా ఇబ్బంది కలుగుతుందని, నిర్దేశించుకున్న కార్యక్రమాల అమలు కష్టమవుతుందన్నారు. దేశ చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.