ఒక్కరోజులో ముగిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన, కారణం ఇదే!
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటన ఒక్కరోజులోనే ముగిసినట్లుగా తెలుస్తోంది. ఆయన మూడు నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారని భావించారు. కానీ అర్ధాంతరంగా ఆయన పర్యటన ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తదితరులను కలుస్తారని భావించారు. కానీ రాజ్నాథ్ సింగ్ను కలిసిన అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కేసీఆర్ కలిశారు. జోనల్ వ్యవస్థపై ఆయనను కలిశారు. అనంతరం ఆయన తిరుగుప్రయాణం అయ్యారు. అయితే, ప్రధాని మోడీ అపాయింటుమెంట్ దొరకకపోవడం వల్లే ఆయన పర్యటన అర్ధాంతరంగా ముగిసిందని చెబుతున్నారు. మోడీని అంతకుముందు కర్ణాటక సీఎం కుమారస్వామి కలిశారు.
అనంతరం ప్రధాని విదేశీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో మోడీ కలవలేకపోతున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మోడీని కలిసే వీలులేకపోవడంతోనే ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వస్తున్నారని సమాచారం.
అంతకుముందు, కేసీఆర్ కొత్త జోనల్ విధానాలపై రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. కొత్త జోనల్ విధానం ఆమోదానికి రాష్ట్రపతి ఆమోదం కోసం ఆయన వినతిపత్రం అందించారు. మరికొన్ని కీలక అంశాలను ఆయనతో చర్చించారు. హైకోర్టు విభజన అంశం కూడా చర్చించారని తెలుస్తోంది.
కొత్త జోనల్ విధానానికి అనుమతితో పాటు హైకోర్టు 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన వంటి కీలక అజెండాతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. మంత్రిమండలిలో కొత్త జోనల్ విధానంపై నిర్ణయం తీసుకున్న వెంటనే దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 371(డి)కి సవరణ కోసం కేంద్రాన్ని కోరుతూ లేఖను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. సీఎస్ లేఖ తయారుచేసి ఇవ్వగానే దానిని తీసుకొని సీఎం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు.