రచ్చ చేస్తున్నారు: గవర్నర్ ఎదుట కెసిఆర్ అసహనం! రెండున్నర గంటలు భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం రాత్రి రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ నెల 23 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పరిస్థితిని గవర్నర్కు వివరించారు.
గణేశ్ నిమజ్జనం, యూనివర్సిటీలకు చాన్స్లర్లు, వైస్ చాన్స్లర్ల నియామకం, వర్సిటీల చట్టంలో మార్పు, చైనా పర్యటన విశేషాలు, రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలు వంటి అంశాలను గవర్నర్కు సీఎం వివరించారని తెలుస్తోంది.
గణేశ్ నిమజ్జనం, బక్రీద్, అసెంబ్లీ సమావేశాలు ఒకే సమయంలో రావడం వల్ల శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం వివరించారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు కేంద్రం నుంచి అదనపు బలగాలను రప్పిస్తున్నామన్నారు.
చైనాలో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనడంతోపాటు తొమ్మిది రోజుల పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి గవర్నర్కు కేసీఆర్ వివరించారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నష్టపరిహారం పెంపు వంటి ప్రత్యేక చర్యలను చేపడుతున్నదన్నారు.
రైతుల్లో ఆత్మస్త్థెర్యం కల్పించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్కు తెలిపారు. రైతు ఆత్మహత్యలపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. చైనా పర్యటన ఫలవంతమైందన్నారు. శాసనసభాసమావేశాలు ఇతర అంశాలపైనా ఆయన చర్చించారు.
దాదాపు రెండున్నర గంటల పాటు వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రైతు ఆత్మహత్యల పేరిట జరుగుతున్న ప్రచారం కుట్రపూరితమని, గోరంతను కొండంతలు చేస్తున్నారని చెప్పారని తెలుస్తోంది. రాష్ట్రంలో రూ.17 వేల కోట్ల రూపాయల రుణ మాఫీకి చర్యలు తీసుకున్నామన్నారు.
ఇప్పటికి రెండు విడతల్లో మాఫీ జరిగిందన్నారు. రైతులకు పెట్టుబడి రాయితీని విడుదల చేశామని, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, వ్యవసాయానికి కోతల్లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించామని చెప్పారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు.
దురదృష్టవశాత్తూ సకాలంలో వర్షాలు పడలేదని, ఆలస్యంగా కురుస్తున్నందున ఈ మేరకు రైతులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. వారికి భరోసా కల్పించేందుకు తాము చర్యలు తీసుకుంటుంటే విపక్షాలు వారి స్త్థెర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని పేర్కొన్నారని సమాచారం.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా పరిహారం పెంచామని తెలిపారు. పదిరోజుల చైనా పర్యటనకు మంచి స్పందన వచ్చిందని, విదేశీ పారిశ్రామికవేత్తలు తెలంగాణ పారిశ్రామిక విధానంపై ఆసక్తిని చూపారని తెలిపారు.
చైనాను చూసి ఎంతో నేర్చుకోవాలని, రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరినీ ఆ దేశానికి పంపించాలని నిర్ణయించామని చెప్పారు. హరితహారం, జలాహారం, ప్రాజెక్టుల రీడిజైనింగు అంశాలపైనా గవర్నర్తో మాట్లాడారని కూడా తెలుస్తోంది.