తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడంటే: గవర్నర్తో కేసీఆర్, జానారెడ్డితో ఆలింగనం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు కేబినెట్లో కేసీఆర్, అలీ ఇద్దరే ఉన్నారు. ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని విస్తరించకపోవడంపై చర్చ సాగుతోంది.
శనివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్లో ఎట్ హోం పేరుతో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనే అంశాన్ని కేసీఆర్.. ఆయనకు చెప్పారని తెలుస్తోంది.
ఫిబ్రవరిలోపు కేబినెట్ విస్తరణ
జనవరి 30వ తేదీన గానీ లేదా ఫిబ్రవరి 7వ తేదీన గానీ మంత్రి వర్గాన్ని విస్తరిస్తామని కేసీఆర్.. గవర్నర్ నరసింహన్కు చెప్పారని తెలుస్తోంది. తేనీటి విందు అనంతరం వీరుద్దరు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటలసేపు ఈ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణపై మాట్లాడారని తెలుస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తయారీ సన్నాహాల గురించి వివరించారని తెలుస్తోంది. బడ్జెట్కు ముందే కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారని వార్తలు వస్తున్నాయి.
కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా
కేంద్ర బడ్జెట్ వచ్చే నెల 1న వస్తుంది. అక్కడ కేటాయింపుల అనంతరం దానికి అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని చెప్పారట. కేంద్ర ఆర్థిక సంఘం వచ్చే నెల 15న రాష్ట్రానికి వస్తుందని, దాని ముందు రాష్ట్ర డిమాండ్లు, కేటాయింపులపై చర్చించాక కేంద్ర సాయంపై స్పష్టత వస్తుందని తెలిపారు.
జానారెడ్డితో కేసీఆర్ ఆలింగనం
కాగా, తేనీటి విందులో కేసీఆర్ - గవర్నర్ నరసింహన్ మధ్య ఓ సమయంలో ఆసక్తికర సంభాషణ జరిగింది. కార్యక్రమం తర్వాత కేసీఆర్ మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చారు. మీడియా వద్ద మీరుంటే వారు నా వైపు రారు అని గవర్నర్ నవ్వుతూ అన్నారు. దానికి కేసీఆర్ స్పందిస్తూ... వారంతా మంచివాళ్లని, అలా చేయరని నవ్వుతూ చెప్పారు. వేదిక వద్ద సీఎం కేసీఆర్ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కలను పలకరించారు. జానారెడ్డిని ఆలింగనం చేసుకున్నారు.