దూసుకొస్తున్న కమలం..! గులాబీ బాస్ లో ఆందోళన..! మున్సిపల్ ఎన్నికలపై కొత్త వ్యూహం..!!
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న గులాబీ పార్టీ ఇప్పుడు ఎన్నికలంటే బిత్తర చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏడాదిలోపులో ప్రజల్లో అనూహ్య మార్పులు వచ్చినట్లు కూడా చర్చ జరుగుతోంది. నిన్నటి ధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లో కనిపించడం లేదనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఫలితంగానే ఊరూవాడా పట్టుకుని అందర్నీ కలుపుకుని ముందుకు సాగాలనుకుంటున్నారు. పార్టీకి అండగా ఉన్న వివేక్, పార్టీలోకి వస్తాడని భావించి మోత్కుపల్లి నర్సింహులు, కమలం పంచన చేరారు. నేడో రేపో, కడియం శ్రీహరి, కేకే వంటి సీనియర్లు కూడా కాషాయగూటిలోకి చేరతారని ప్రచారం ఊపందుకుంది. దీంతో గులాబీ బాస్ లో తెలియని ఆందోళన మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది.
మారుతున్న రాజకీయ సమీకరణాలు..! మున్సిపల్ ఎన్నికల కోసం కేసీఆర్ కొత్త ప్రణాళికలు..!!
గులాబీ పార్టీకి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేకపోయినా, అర్ధాంతరంగా వచ్చే ఆపద మాత్రం గ్రేటర్ ఎన్నికల రూపంలో హెచ్చరిస్తున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లకు 100 గెలుచుకుంటామని కేటీఆర్ సవాల్ విసిరి మరీ గెలిచారు. మిగిలిన చోట్ల ఎంఐఎం విజయం సాధించింది. కానీ టీడీపీ గెలిచిన ఒక్కసీటు కూడా పాపం గులాబీ ఖాతాలోకి చేరింది. అది గతం. ఇప్పుడు గులాబీ పార్టీ అనుకున్నంత బలంగా లేదు. పైగా రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, బీజేపీ సమఉజ్జీలుగా తలపడుతున్నాయి.
ఆర్టికల్ 370 రద్దుతో పెరిగిన బీజేపి ఆదరణ..! తెలంగాణ పై ప్రభావం చూపకుండా కేసీఆర్ వ్యూహ రచన..!!
తాజాగా నరేంద్రమోదీ కశ్మిర్ విషయంలో తీసుకున్న నిర్ణయం, 370 ఆర్టికల్ రద్దు ప్రభావం హిందూ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుంది. కేంద్రం నిర్ణయానికి అనుకూలంగా గులాబీ పార్టీ ఓటేస్తే, సోదర పార్టీ ఎంఐఎం మాత్రం వ్యతిరేకించింది. దీని ప్రభావం ఇక్కడ మాత్రం కనిపించట్లేదు. అయితే బీజేపీ మాత్రం నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని గ్రేటర్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తుంది. వాస్తవంగా కూడా హైదరాబాద్ ను కైవసం చేసుకోవటం ద్వారా 2023 నాటికి తాము మరింత బలంగా మారాలనే కాషాయసోదరులు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
గ్రేటర్ లో చెప్పి మరీ టర్గెట్ ఛేదించిన టీఆర్ఎస్..! ఇప్పుడు పరిస్థితులు అందుకు విరుద్దం..!!
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పట్టు కొనసాగించేందుకు ముందస్తుగానే గ్రేటర్ లో ఎన్నికలు జరపాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దానికి అనువుగా పావులు కదపటం, అన్ని వర్గాలను ముఖ్యంగా ఆంద్ర ప్రజలను మచ్చిక చేసుకోవటం ద్వారా బీజేపీను ఎదుర్కోవాలనేది ఎత్తుగడగా తెలుస్తోంది. వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కార్పొరేటర్లు ఇంత వరకూ పైసా ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోయారు. గతంలో కమీషన్లు, కాంట్రాక్టులు, వసూళ్లతో కోటి ఖర్చుపెట్టిన చోటా నేతలు ఐదేళ్లలో వందకోట్ల వరకూ కూడబెట్టేవారు. ప్రస్తుతం అవినీతి సంగతి ఎలా ఉన్నా అధికారపార్టీ కార్పొరేటర్లు మాత్రం ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగాలేరని తెలుస్తోంది.
గులాబీ నేతల మద్య విభేదాలు..! మున్సిపల్ ఎన్నికలపై బాస్ ఆందోళన..!!
మొన్నటి ఎన్నికల్లో ఖర్చుచేసిన పైసలు కూడా ఇప్పటి వరకూ గిట్టుబాటు కాలేదనే భావన కూడా చాలామందిలో ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల మద్య మళ్లీ వాళ్లే రంగంలోకి దిగే సాహసం చేయలేరనే చర్చ కూడా జరుగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గల్లీ నేతలకు మధ్య దూరంగా కూడా పెరిగింది. గత ఎన్నికల్లో తమకు కార్పొరేటర్లు సాయం చేయలేదనే కోపం కూడా ఎమ్మెల్యేల్లో నెలకొని ఉంది. ఇన్ని అడ్డంకులను అధిగమిస్తూ గులాబీ జెండాను మరోసారి గ్రేటర్ పై ఎగురవేయటం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు సవాల్ గా మారింది. కాబట్టే. కొత్త వ్యూహంతో సమస్య నుంచి గట్టెక్కాలనే పథక రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఏడాది ముందుగానే బల్దియా ఎన్నికలు జరిపించి, తన కల నెరవేర్చుకోవాలనే యోచనలో సీఎం చంద్రశేఖర్ రావు ఉన్నట్టు తెలుస్తోంది.