బట్టేబాజ్ అని తిట్టినా అందుకే నోరు కట్టుకున్నా: నిజామాబాద్ సభలో కేసీఆర్
నిజామాబాద్: వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. తనను టీపీసీసీ చీఫ్ బట్టేబాజ్ అన్నారని, ఓ ముఖ్యమంత్రిని అలా అనవచ్చా అని, తాను గౌరవపదమైన పదవిలో ఉన్నానని, నోరు కట్టుకున్నానని చెప్పారు.
నిజామాబాద్ జిల్లాలో ఈ సభ ఓ ప్రభంజనం అన్నారు. తాము అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో అన్నీ సంక్షోభాలే అన్నారు. కానీ ఇప్పుడు 24 గంటల నిరంతర విద్యుత్ సాధించామని చెప్పారు. తెలంగాణలో మిషన్ భగీరథ ఇవాళ పరుగులు పెడుతోందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురువేసిన జిల్లా నిజామాబాద్ అన్నారు. కేసీఆర్ వల్లే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పింఛన్ రూ.2వేలు అంటోందన్నారు.
ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు చేరబోతున్నాయని చెప్పారు. 42వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణలో ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. పింఛన్లు మరోసారి పంచే యోచనలో ఉన్నామని, త్వరలో మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పారు. 452పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
కేసీఆర్ ఇప్పటికీ చెప్పలేదు, నేను పోటీ చేయను: విజయశాంతి, మేమే కీలకం: కోదండరాం
పోచారం శ్రీనివాస్ రెడ్డికి నేను పెట్టిన పేరు లక్ష్మీపుత్రుడు అని కేసీఆర్ అన్నారు. పోచారం నికార్సయిన రైతు బిడ్డ అని, రైతుల కోసం పని చేస్తున్నారని చెప్పారు. పింఛన్ పెంచుతామని, ఎంతో ముందు చెబుతామన్నారు. కేసీఆర్ ముందస్తుకు దమ్ముందా అని తనకు సవాల్ విసిరారని, ఇప్పుడు మాత్రం విపక్షాలు గోడలు గీకుతున్నాయని, గందరగోళపడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే కరెంట్ రాదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, కానీ ఇప్పుడు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలోని పదేళ్ల కంటే ఈ నాలుగేళ్ల తెరాస పాలనలో ఇసుకపై ఎక్కువ ఆదాయం వచ్చిందని చెప్పారు. మళ్లీ తెరాసను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. పోచారం వ్యవసాయ మంత్రి అయ్యాక రైతులకు మేలు జరిగిందని చెప్పారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఉందని చెప్పారు. చిల్లర రాజకీయాల కోసం కొందరు ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు వేశారన్నారు. సమైక్య పాలనలో నీళ్లు, ఉద్యోగాలు మనకు రాకున్నా కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదన్నారు.