వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కేసీఆర్?: అక్కడి నుంచి పోటీ?..
కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీకి, అధినేత కేసీఆర్కి తెలంగాణ ఉద్యమ సమయంలో కంచుకోటలా నిలిచిన కరీంనగర్పై గులాబీ బాస్ మరోసారి దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఆయన ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు కేసీఆర్ను కోరినట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్లోనే ఉంటా, కేసీఆర్ మాటే నా బాట: స్పష్టం చేసిన హరీష్ రావు
2004లో కరీంనగర్:
తెలంగాణ ఉద్యమాన్ని ఉపఎన్నికల వ్యూహంతో ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్.. ఇందుకోసం పలుమార్లు కరీంనగర్ ను కేంద్రంగా మార్చుకున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో బరిలో దిగిన కేసీఆర్.. బీజేపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్రావుపై 1,31,168 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
2006,2008లలో..
2006లో జరిగిన ఉపఎన్నికలో మళ్లీ కరీంనగర్ స్థానం నుంచే పోటీ చేశారు కేసీఆర్. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి టీ.జీవన్రెడ్డిపై కేసీఆర్ 2,01,582 ఓట్ల ఆధిక్యం సాధించారు.
మరోసారి 2008లో కరీంనగర్ ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగ్గా.. అందులో 15,765 స్వల్ప ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత 2009లో తన తన స్థానాన్ని మహబూబ్ నగర్ షిఫ్ట్ చేశారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దేవరకొండ విఠల్రావుపై 20,184 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
2019లో కరీంనగర్ లోక్ సభ?
ఇక 2014సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా, గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే యోచనలో ఉన్న కేసీఆర్.. మళ్లీ తన పాత స్థానమైన కరీంనగర్ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రచారం కూడా
మరోవైపు కేసీఆర్ నల్గొండ లేదా రంగారెడ్డిల్లో ఏదో ఒక స్థానం నుంచి ఎంపీగా బరిలో దిగవచ్చుననే ఊహాగానాలు కూడా ఉన్నాయి. రంగారెడ్డి కంటే నల్గొండ నుంచి పోటీ చేయడానికే కేసీఆర్ ఎక్కువ ఆసక్తి చూపించవచ్చునని కూడా అంటున్నారు.
నల్గొండలో కాంగ్రెస్ కాస్త బలంగా ఉన్నందునా.. కేసీఆర్ పోటీ చేస్తే ఆ పార్టీ ప్రభావం తగ్గించవచ్చుననే వ్యూహం కూడా అందులో ఉంది. పోటీపై అంతిమ నిర్ణయం కేసీఆర్దే కాబట్టి.. ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారో వేచి చూడాలి.