మీ దీవెనలతో యుద్ధానికి వెళుతున్నా: కోనాయిపల్లిలో కేసీఆర్
Recommended Video
కోనాయిపల్లి: మీ దీవెనలతో యుద్ధానికి పోతున్నా అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న కేసీఆర్ ముందుగా కోనాయిపల్లిలోని ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడారు. కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్న తర్వాతే తెలంగాణ ఉద్యమంకు బయలుదేరి వెళ్లినట్లు కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కూడా స్వామివారిని దర్శించుకున్నానని చెప్పిన కేసీఆర్ తెలంగాణలో 100 సీట్లలో విజయం సాధిస్తామని చెప్పారు.
వచ్చే ఏడాదికల్లా కాళేశ్వరం జలాలతో కోనాయి పల్లి వెంకటేశ్వర స్వామి పాదాలు కడుగుతామని కేసీఆర్ అన్నారు. అక్కడికి చేరివచ్చిన కార్యకర్తలు అభిమానులు గ్రామస్తుల దీవెనలతో తాను యుద్ధానికి వెళుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ప్రతి రైతు ఆనందంతో జీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ రైతుల ఆదాయం పెరగాలన్న కేసీఆర్... దేశంలోనే ధనిక రైతులకు తెలంగాణ వేదికవ్వాలని చెప్పారు. తెలంగాణ సాధనకు పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఎవరూ నమ్మలేనంతగా ఇక్కడి సమస్యలను పరిష్కరించుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. ఢిల్లీకి రాజైనా... మీ మధ్యే ఉన్నానని కేసీఆర్ చెప్పారు. సిద్దిపేటకు ఒక్క విమానం తప్ప అన్ని తీసుకొచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం చక్కదిద్దే క్రమంలో సిద్ధిపేట ప్రజలకు దూరమైనట్లు కేసీఆర్ వివరించారు. రైతుల బ్యాంకు బ్యాలెన్స్ బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమైనట్లు అని చెప్పారు.
సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్ రావును ఆశీర్వదించాలని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. హరీష్ రావు ఈ సందర్భంగా కేసీఆర్కు పాదాభివందనం చేశారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 2:34 గంటలకు కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆలయంలోనే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్నారు గులాబీ దళపతి.