నోట్ల రద్దుపై నేనే మాట్లాడతా: కేసీఆర్, ‘మోడీ నా సలహాలు పాటిస్తే బంగారు భారత్’
శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు టిఆర్ఎస్ మంత్రులు, సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. పెద్ద నోట్ల రద్దుపై తానే మాట్లాడతానని ఆయన చెప్పారు.
హైదరాబాద్: శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు టిఆర్ఎస్ మంత్రులు, సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. పెద్ద నోట్ల రద్దుపై తానే మాట్లాడతానని ఆయన చెప్పారు. అంతేగాక, 'పెద్ద నోట్ల రద్దు తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని మోడీతో మాట్లాడాను. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాను. వాటిని కనుక ప్రధాని అమలుచేస్తే.. బంగారు భారతమే ఆవిష్కృతమవుతుంది' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
పెద్ద నోట్ల(రూ.1000, రూ.500) రద్దు తర్వాత ప్రధానితో మాట్లాడిన ముఖ్యమంత్రి, నాయకుడిని తాను ఒక్కడినేనని, ఈ విషయంలో ఇతరులెవరూ ఆయనతో మాట్లాడలేదన్నారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్లో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. టిఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు సహా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 40 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం ఒక్కరే మాట్లాడారు.
నోట్ల రద్దు రాష్ట్ర పరిధిలో తీసుకున్న నిర్ణయం కాదని, అది మన అంశమే కాదని.. విపక్షాలు కోరినందున చర్చకు పెడుతున్నామని సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఆ అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడొద్దని, తానే మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఇక తొలిరోజు మండలిలో విద్యుత్ పరిస్థితిపై మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడతారని, రెండో రోజు మండలిలో నోట్లరద్దు అంశంపై తాను మాట్లాడతానని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించామని, అయితే అదే సమయంలో ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రధాని దృష్టికి తీసుకువెళుతున్నామని తెలిపారు. నోట్ల రద్దుతో మనకూ నష్టం జరిగిందని, ఆదాయం పడిపోయిందని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరిగిందన్నారు.
కాగా, 'సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలకు ఎజెండానే లేదు. ఏం మాట్లాడినా మనమే మాట్లాడాలి. బీఏసీ సమావేశానికే విపక్షాలు నాలుగైదు అంశాల పాయింట్లు రాసుకుని వచ్చాయి. అత్యధిక సభ్యులం మనమే ఉన్నాం. మన సమయం మనం వినియోగించుకుందాం. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏం చేశామో ప్రజలకు వివరిద్దాం' అని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ విషయంలో నిక్కచ్చిగా ఉందామని, నిర్ణీత గడువులోగా సమాధానాలు చెప్పాలని మంత్రులకు సూచించారు. ముఖ్యంగా సభ్యులు అడిగిన ప్రశ్నల పరిధిలోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదనపు సమాచారం ఇస్తూ, విషయం నుంచి ఎందుకు పక్కకు పోతున్నారని కూడా ప్రశ్నించారని తెలిసింది.
మంత్రులు, ఇతర సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ నోటి దురుసుకు పోవద్దని, సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశాలు కీలకమైనవని, పార్టీ సభ్యుల హాజరు నూటికి నూరుశాతం ఉండాల్సిందే నని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సమావేశం ముగిసే వరకూ ఉండాలని, తప్పని పరిస్థితి అయితే, ఆయా జిల్లాల మంత్రులకు సమాచారం ఇవ్వాలని సూచిం చారు.
శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు టిఆర్ఎస్ మంత్రులు, సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. పెద్ద నోట్ల రద్దుపై తానే మాట్లాడతానని ఆయన చెప్పారు.