విద్యుత్ కాంతులతో నింపుతాం: కేసీఆర్, ‘20వేల మంది రెగ్యూలరైజ్’
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కొరతను అధిగమించిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కొరతను అధిగమించిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాడే నాటికి రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు స్వల్ప, మధ్య కాలిక ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
గతంలో విద్యుత్ కొరతతో పంటలు, పరిశ్రమలు దెబ్బతిన్నాయని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఉత్పత్తికి, డిమాండ్కి మధ్య 1000మెగావాట్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఉందని ఉందని చెప్పారు. అయినా కోతల్లేకుండా విద్యుత్ను అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వచ్చారని వ్యాఖ్యానించారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రామగుండంలో 4వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో చేరబోతున్నామని చెప్పారు.
నిరంతర విద్యుత్ సరఫరా కోసం శ్రమిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందికి ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. విద్యుత్ శాఖలోని 20వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ శాఖలో 1100మందిని ఇప్పటికే రెగ్యూలర్ చేశామని చెప్పారు. భవిష్యత్లో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూస్తామని, విద్యుత్ మిగులు రాష్ట్రంగా రూపుదిద్దుతామని చెప్పారు. రాష్ట్రాన్ని విద్యుత్ కాంతులతో నింపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.