రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పూర్తి, అలసత్వం వద్దు: కెసిఆర్
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సూచించారు. బడ్జెట్లో నీటిపారుదల ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
పాలమూరు ప్రాజెక్ట్పై సీఎం శనివారం క్యాంప్ ఆఫీసులో మంత్రులు హరీష్రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణ, నష్టపరిహారం, ప్రాజెక్టు విస్తరణపై సమీక్షించిన ఈ సందర్భంగా స్పందించారు.
పంప్హౌజ్లు, కాల్వల పనులు, జలాశయాలు, టన్నెళ్ల పనులు సమాంతరంగా జరగాలని అధికారులు, మంత్రులకు సూచించారు. రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రాజెక్టును విస్తరించి నీరివ్వాలని ఆదేశించారు. 2 వారాల్లో సర్వే చేసి డిజైన్లు రూపొందించి టెండర్లు పిలవాలని పేర్కొన్నారు.
అధికారులు అలసత్వం చూపకుండా పనిచేయాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రతి సోమవారం సమక్షించాలని, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.
‘ప్రాజెక్టులకు వెనువెంటనే బిల్లులు చెల్లిస్తాం. ప్రాజెక్టు పూర్తితో మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలి. త్వరితగతిన భూసేకరణ చేయాలి. రైతుల భూములు, ఇండ్లు, స్థిరాస్తులకు విలువకట్టి వెంటనే పరిహారం చెల్లించాలి. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులకే మొదటి ప్రాధాన్యత' అని సిఎం తెలిపారు.
‘ప్రతి ఏటా నీటిపారుదల శాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయిస్తాం. డిజైన్ల రూపకల్పనలో, ఇతర పనుల్లో అవసరమైతే రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలి. ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ సరఫరాకు జెన్కో, ట్రాన్స్కోతో సమన్వయం చేసుకోవాలి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి' అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.