తిరుమలకు బయలుదేరిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమలకు బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు బయల్దేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. ఆదివారం రాత్రి కొండపైన గెస్ట్ హౌస్లో కేసీఆర్ బస చేయనున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం తిరుమల నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకోనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీర్ తిరుమలకు వెళ్లడం ఇది రెండోసారి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అప్పట్లో స్వామి వారికి కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు.
తిరుమల పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ నెల 29న సీఎం కేసీఆర్ సతీసమేతంగా విజయవాడ వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బసచేసి 30వ తేదీ ఉదయం కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరుకానున్నారు.