కేంద్రం నుంచి ఏం రాలేదు: కేసీఆర్, నిరుద్యోగ భృతి రూ.3వేలు, టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదీ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం నాు టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో కమిటీకి 300కు పైగా విజ్ఞాపనలు వచ్చాయని చెప్పారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బెజవాడ నుంచి పాదయాత్ర: కేసీఆర్ కోసం ప్రచారం చేస్తానని ఏపీ రోహిత్, కేటీఆర్ ఆలింగనం
తెలంగాణను సాధించిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కొన్ని పార్టీలకు పొలిటికల్ గేమ్ అయితే, మాకు మాత్రం టాస్క్ అన్నారు. గత నాలుగేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను రూకపల్పన చేశామని చెప్పారు. ఓట్లు రాబట్టుకోవడానికి తాము మేనిఫెస్టోను తయారు చేయలేదని చెప్పారు. తెలంగాణను సాధించిన పార్టీగా తమపై బాధ్యత ఉందన్నారు.
అయోమయ పరిస్థితి నుంచి సంపూర్ణ అవగాహన వరకు
మేనిఫెస్టో కమిటీకి వచ్చిన దాదాపు 300 విజ్ఞాపనలతో పాటు నాలుగేళ్లుగా ప్రజలు సూచించిన విజ్ఞాపనలు కూడా పరిగణలోకి తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. మేం చేరుకోవాల్సిన గమ్యాలు చాలా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతో అయోమయ పరిస్థితి ఉండేదన్నారు. ఆనాడు ఓ పథకం రూపకల్పణ చేయడానికి ఎంతో తర్జన భర్జన పడ్డామని చెప్పారు. ఏడాది తర్వాత తర్వాత గానీ కళ్యాణలక్ష్మిపై ఓ అవగాహనకు రాలేకపోయామన్నారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితిపై సంపూర్ణ అవగాహన ఉందని చెప్పారు. తమకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉందన్నారు.
తెలంగాణ వేరు, కేంద్రం నుంచి రూపాయి రాలేదు
అన్ని రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు అని కేసీఆర్ తెలిపారు. మిషన్ భగీరథ వంటి పథకాలకు రాష్ట్ర హక్కుగా రావాల్సిన నిధులను నీతి అయోగ్ ద్వారా రూ.24వేల కోట్లు కోరితే కేంద్రం రూ.24 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు కేంద్రం చేయి విదిల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అదనంగా వచ్చే ఆదాయం ఏదీ లేదన్నారు. పక్కా లెక్కలతోనే ఇప్పుడు మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు. కేంద్రం నుంచి ఒక్క పైసా రాలేదన్నారు. అయిదేళ్లలో తెలంగాణకు వచ్చే ఆదాయం రూ.10 లక్షల 37వేల కోట్లు అన్నారు. చెల్లించాల్సిన అప్పులు రూ.2 లక్షల 70వేల కోట్లు అన్నారు.
జీవన విధ్వంసం పునరుద్ధరణ
సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం అపారమైనదని కేసీఆర్ చెప్పారు. దీనిని పునరుద్ధరించాల్సి ఉందన్నారు. చెరువులతో పునరుద్ధరణ కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం జరగాలన్నారు. మరో రెండేళ్లలో తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు. కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం ఉంటే రూ.20వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్లు వస్తాయన్నారు. మహారాష్ట్రకు రూ.15వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో రైతు రాజు కావాలని, వ్యవసాయానికి పూర్వ వైభవం రావాలన్నారు. 2021 జూన్ నాటికి కోటి ఎకరాలకు సాగునీరు వస్తుందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
రైతు బంధుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. భూరికార్డులను ప్రక్షాళణ చేశామని, రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. 45.5 రైతులకు రూ.ఒక లక్ష రుణమాఫీ చేశామని చెప్పారు. గతంలో వలే ఈసారి కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. రైతు బంధు కింద సంవత్సరానికి రూ.10వేలు ఇస్తున్నామని చెప్పారు. రైతు సమన్వయ సమితులకు గౌరవభృతి ఇస్తామని చెప్పారు. పథకాల విషయంలో కొందరికి చాలా సంతృప్తి కలుగుతుందని, కొందరికి కొంత బాధ కలుగుతుందని చెప్పారు.
ఇవి ఇస్తాం
57 ఏళ్లు పూర్తయిన వారికి పింఛన్ ఇస్తామని కేసీఆర్ చెప్పారు. పింఛన్ వయోపరిమితి తగ్గింపుతో అదనంగా 8 లక్షలమందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతులకు రూ.ఒక లక్ష రుణమాఫీ చేస్తామన్నారు. రైతు సమన్వయ కమిటీలకు గౌరవ భృతి ఉంటుందని తెలిపారు. రైతు బంధు పథకంలో ఎకరానికి రూ.10వేలకు పెంపు అన్నారు. ఆసరా పింఛన్లను రూ.2016కు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ భృతిని రూ.3016గా ఇస్తామని చెప్పారు. వికలాంగులకు రూ.3.016 ఇస్తామని చెప్పారు.
అగ్రవర్ణ పేదలకు అండగా, గ్యాస్ ధరపై
సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇటీవల అగ్రవర్ణాల నుంచి డిమాండ్ వస్తోందన్నారు. పేదరికానికి కులం లేదని చెప్పారు. వైశ్యులు, రెడ్లు, బ్రాహ్మణుల్లో పేదలు ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సాయం చేసినట్లుగానే మా వర్గాల్లోని పేదలను కూడా ఆదుకోవాలని కోరుతున్నారని చెప్పారు. రెడ్డి, వైశ్యులకు కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. గత ఎన్నికల్లో తాము తక్కువ చెప్పి ఎక్కువ చేశామన్నారు. కాంగ్రెస్ మాత్రం ఏమీ చేయలేదన్నారు. గ్యాస్ ధర తగ్గిస్తామని విపక్షాలు చెబుతున్నాయని, కానీ అది పెరుగుతోందని కేసీఆర్ అన్నారు. తాము ప్రాక్టికల్గా ఆలోచించి పథకాలు రూపొందిస్తామని చెప్పారు. ప్రకటించిన పథకాలన్నీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. ఉద్యోగులకు సముచిత గౌరవం కల్పిస్తామన్నారు.నాలుగేళ్లలో రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు 17.17 శాతంగా ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ ఏడాది 19.78 శాతం వృద్ధి రేటు అన్నారు. ఉద్యోగులు బెంబేలెత్తవద్దని, బాధపడవద్దని చెప్పారు. మేం చేసేది చెబుతామని, మిగతా వాళ్ల సంగతి మాకు అనవసరమని చెప్పారు. ఇది పాక్షిక మేనిఫెస్టో అని, పూర్తిస్థాయి మేనిఫెస్టో త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పైసా పైసా లెక్క చూసుకొని హామీలు ఇస్తున్నామన్నారు.