24 గంటలు గజ ఈతగాళ్లు: కెసిఆర్ ఆదేశం, ట్రాఫిక్ చిక్కులు
హైదరాబాద్: గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 24 గంటలపాటు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. పుష్కరాలపై ఆయన శనివారంనాడు సమీక్ష నిర్వహించారు. రోడ్లపై రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ క్లియరెన్స్కు చర్యలు తీసుకోవాలన్నారు.
వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించాలని సూచించారు. టోల్గేట్ల వద్ద వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ శివార్లలో రహదారులపై ట్రాఫిక్ను యుద్ధప్రతిపాదికన క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టోల్గేట్ల వద్ద వాహనాలను ఎక్కువసేపు ఆపకుండా త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలు వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ అధికమవుతున్న నేపథ్యంలో పుష్కరఘాట్ల వద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ పుష్కరఘాట్ వద్ద మంచి నీటి సదుపాయం, వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పుష్కరఘాట్లలో 24 గంటల పాటు గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నేడు, రేపు సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి గోదావరి పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లే రహదారులపై, జేబీఎస్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
తెలంగాణలో గోదావరి పుష్కరాలు వైభవంగా కొనసాగుతోన్నాయి. బాసర నుంచి భద్రాద్రి వరకు గల పుష్కరఘాట్ల వద్ద భద్రతపై డీజీపీ అనురాగ్శర్మ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరఘాట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా రద్దీని నియంత్రిస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల వాహనాలు నిలిపివేసి రద్దీని క్రమబద్దీకరిస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇదిలావుంటే, పుష్కర వాహనాలతో తెలంగాణలోని రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ఏ రోడ్డుపై చూసినా భక్తులతో నిండుగా ఉన్న వాహనాలే దర్శనమిస్తున్నాయి. వరుస సెలవులు రావడంతో పుష్కరాల కోసం ప్రజలు ఒక్కసారిగా వాహనాల్లో బయలుదేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
ట్రాఫిక్ను క్లియర్ చేయలేక పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పుష్కర వాహనాలతో ధర్మపురి, కాళేశ్వరం, ఏటూరునాగారం, భద్రాచలం రహదారులు నిండిపోయాయి. ఇక కరీంనగర్ జిల్లాలోని ధర్మారం నుంచి రాయపట్నం వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర మూడు గంటల నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.