కేసీఆర్ కొత్త చట్టం ఎఫెక్ట్.. పదవి కోల్పోయిన సర్పంచ్.. అంతా రాజకీయం అంటున్న బాధితుడు..!
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం సర్పంచుల పాలిట శాపంగా మారింది. ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడంతో గుస్సా మీదున్న సర్పంచుల నోట్లో మరో వెలక్కాయ పడింది. వారు విధిగా రెండు నెలలకోసారి గ్రామసభ పెట్టాలనే అంశం చట్టంలో ఉంది. చట్టంలో ఉంటే ఓకే కానీ .. అదీ అమలవడంతో ఓ సర్పంచ్ ఆందోళన చెందుతున్నాడు. గ్రామసభ పెట్టలేదనే కారణంతో అతడిని ఆరు నెలలు సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కార్యదర్శి తీరుపైనే మండిపడుతున్నారు.
ఇటీవల రాష్ట్రంలోని పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. నల్గొండ జిల్లా చెరుకుపల్లిలో సర్పంచ్ కూడా ఎన్నిక జరిగింది. అయితే ఆ సర్పంచ్కు గ్రామసభ పేరుతో పోస్టు బూస్టిండవడం కలకలం రేపింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆయా పంచాయతీలో సర్పంచ్ విధిగా రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. అయితే సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి అతను గ్రామసభ నిర్వహించలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శి నల్గొండ జిల్లా కలెక్టర్కు రిపోర్ట్ చేశాడు. అంతే వెంటనే సర్పంచ్పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అతనిని ఆరునెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
అయితే సర్పంచ్ మాత్రం పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను గ్రామసభ పెట్టానని చెప్తున్నాడు. కానీ పంచాయతీ కార్యదర్శి మాత్రం తప్పుడు రిపోర్ట్ పంపారని దుమ్మెత్తిపోశారు. అతను గ్రామానికి రావడం లేదని .. డుమ్మా కొడుతున్నాడని ధ్వజమెత్తారు. తాను రాకుండా నేరం తనపై మోపడని మండిపడ్డారాయన. సర్పంచ్ తన పరిధి మేరకు వ్యవహరించానని .. గ్రామసభ నిర్వహించానని చెప్తున్నారు. అయితే చెరుకుపల్లి సర్పంచ్పై కలెక్టర్ చర్యలు తీసుకోవడంతో అతని వాదనలు వినే అవకాశం లేకుండా పోయింది. అయితే దీనిపై బాధితుడు కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.