ప్రముఖులున్నా వదలొద్దు: అకున్ సబర్వాల్కు కేసీఆర్ ఫోన్, తేల్చేశారు
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ దందాపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. డ్రగ్స్ దందాతో సంబంధమున్న ఎవరినీ వదలొద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కి తేల్చి చెప్పారు.
శనివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్.. అకున్ సబర్వాల్కి ఫోన్ చేశారు. సీఎం కేసీఆర్ సూచనతోనే అకున్ సబర్వాల్ తన సెలవులు వాయిదా చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో సెలవులు పెట్టడం వల్ల ప్రభుత్వానికి, ఆయనకూ చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతో అకున్ సబర్వాల్ తన సెలవులను రద్దు చేసుకున్నట్లు తెలిసింది.
డ్రగ్స్ కేసులో ఎంతటి ప్రముఖులున్నా వదిలి పెట్టవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్.. సబర్వాల్కు తేల్చి చెప్పారు. కేసులో ఉన్న వారందరి పేర్లను బయటపెట్టాలని ఆదేశించారు. ఎవర్నీ కాపాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
కాగా, డ్రగ్స్ కేసులో మరొకరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజీ కాలనీ నుంచి ఎక్సైజ్ ఆఫీసుకు తరలించారు. ఇతడి అరెస్టుతో డ్రగ్స్ కేసులో మొత్తం అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది.