గులాబీ బాస్ యోచన .... హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి ఏపీ వైసీపీ నేతలు ?
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ ఉప పోరు అన్ని ప్రధాన పార్టీలకు కత్తి మీద సాములా మారాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నుండి అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 7 వేల ఓట్లతో ఓటమిపాలైన సైదిరెడ్డి ని రంగంలోకి దిగారు . ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు . సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉండే హుజూర్ నగర్లో ప్రచారానికి ఏపీ వైసీపీ నేతలను తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని చర్చ జరుగుతుంది.
హుజూర్ నగర్ లో కేటీఆర్ వ్యూహం ఫలిస్తుందా..? ఫలితం అనుకూలమా..? ప్రతికూలమా..?
హుజూర్ నగర్ లో కమ్మ, కాపు లీడర్లతో ప్రచారం చేయించాలని టీఆర్ఎస్ భావిస్తోంది . క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకున్నంత ఈజీగా లేకపోవటంతో, కులాల వారీగా ప్రచారాలకు తెరలేపాలని గులాబీ నేతలు అనుకుంటున్నారని తెలుస్తుంది . వైసీపీ ఎమ్మెల్యేలతో పూర్తిస్థాయిలో ప్రచారం చేయించడానికి టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని టాక్ వినిపిస్తుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సింగిల్గా కాకుండా ఎత్తులతో , మద్దతుతో వెళ్తున్న గులాబీ పార్టీ ఇప్పటికే సీపీఐ మద్దతు తీసుకుంటుంది.
ఇప్పటి వరకు ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా, అవి తమకే అనుకూలంగా ఉంటాయని భావించే టీఆర్ఎస్ హుజూర్ నగర్ లో అసలు పోటే లేదని అనుకుంది. తీరా గ్రౌండ్ లోకి వెళితే అక్కడ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయనే అంచనాకొచ్చారు. దీంతో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు.
అక్కడ సామాజిక సమీకరణాల నేపధ్యంలో కాపుల్లో టీఆర్ఎస్పై కొంత సానుకూలత ఉన్నా కమ్మ సామాజిక వర్గం ఓటర్లలో పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ రెండు సామాజిక వర్గాల ఓటర్లను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు. దాని కోసం ఏపీలోని కమ్మ , కాపు సామాజిక వర్గ నేతలను రంగంలోకి దించి, ఆయా మండలాల్లో ప్రచారం చేయించాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. నియోజకవర్గంలో కమ్మలు 11 వేల ఓటర్లు ఉండగా, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఏడు వేల మంది ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు టార్గెట్గా కాపు, కమ్మ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలను ప్రచారానికి పంపాలని ఏపీ సీఎం జగన్కు విజ్ణప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దసరా పండుగ తర్వాత పది రోజుల పాటు ఏపీ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలు తెలంగాణాలోని హుజూర్ నగర్ లో ప్రచారం చెయ్యనున్నారని పార్టీలో చర్చ సాగుతుంది.