సొంత ఇలాకాలో 'ముందే' దెబ్బ: రేవంత్ని దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ పక్కా స్కెచ్
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్పై అధికార టిఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుగా పావులు కదుపుతోంది.
హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్పై అధికార టిఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుగా పావులు కదుపుతోంది.
Recommended Video
చదవండి: ఇమేజ్ డ్యామేజ్, ఎదురుగాలి: రేవంత్కు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్, రాంగ్స్టెప్?
వ్యూహాత్మకంగా తెరాస అడుగులు
రేవంత్కు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. ఏ పార్టీ లేకుండా సొంతగా ఆయన నెగ్గుకు వస్తారు. అలాంటి పట్టు ఉన్న రేవంత్ను దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వారం పది రోజులుగా మరింత దూకుడు పెంచింది.
రేవంత్ రెడ్డి పట్టు కోల్పోతున్నారా?
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయేలా చేయాలన్నది టిఆర్ఎస్ వ్యూహం. అందులో భాగంగా ఇప్పటికే పలువురు ముఖ్య నేతలను తనవైపుకు లాక్కుంది. మరికొందరిని విడతల వారీగా చేర్చుకుంటోంది. ఇటీవలి కాలంలో ముఖ్య నేతలు టిడిపిని వీడుతుండటంతో రేవంత్ పట్టు కోల్పోతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే దెబ్బతీసే వ్యూహం
రేవంత్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అభిమానులను, ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు సొంత నియోజకవర్గంలో షాకిచ్చి, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తోంది టిఆర్ఎస్. అందుకే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ముందే సాధ్యమైనంత ఎక్కువ మంది ఆయన అనుచరులను టిఆర్ఎస్ వైపు లాగుతున్నారు.
కోటలు బీటలు వారేలా చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని
ఆయన కొడంగల్ కోటలను బీటలు వారేలా చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇప్పటికే రేవంత్ ముఖ్య అనుచరుడు బాలూసింగ్తో పాటు పలువురిన తెరాసలో చేర్చుకున్నారు.
గుర్నాథ్ టిఆర్ఎస్లో చేరినా రేవంత్ ధాటికి నిలబడలేదు
కొడంగల్లో తొలి నుంచి కాంగ్రెస్ వర్సెస్ టిడిపిగా ఉంటోంది. గత ఎన్నికల్లో గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్లో చేరారు. కానీ రేవంత్ హవా ముందు నిలబడలేకపోయారు. ఆ తర్వాత టి-టిడిపిలో రేవంత్ క్రమంగా కీలకంగా మారారు. అప్పటి నుంచే రేవంత్ను వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఓటుకు నోటు టైంలోను రేవంత్ రెడ్డికి అండగా కొడంగల్
ఓటుకు నోటు కేసు ఘటన నుంచి చాలామంది టిడిపి ముఖ్య నేతలు తెరాసలో చేరారు. కొడంగల్ పైనా అధికార పార్టీ దృష్టి సారించింది. కానీ కీలక నేతలు ఎవరు కూడా రేవంత్ను విడిచి పెట్టి రాలేదు. ఓటుకు నోటు కేసు సమయంలోను ఆయన పైన విశ్వాసంతో ఆయన వెన్నంటే ఉన్నారు.
చక్రం తిప్పుతున్న మంత్రులు, రేవంత్కు సీన్ రివర్స్
ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యాక మాత్రం కొడంగల్లో రేవంత్కు కొంత సీన్ రివర్స్ అవుతోంది. నాలుగు రోజుల క్రితం కీలక అనుచరుడు బాలూసింగ్ తెరాసలో చేరారు. మంగళవారం మరికొందరు చేరారు. జూపల్లి, లక్ష్మారెడ్డిలు కొడంగల్పై ప్రత్యేకంగా దృష్టి సారించి నేతలను ఆకర్షిస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే ఆయనను సాధ్యమైనంత దెబ్బతీయాలని టిఆర్ఎస్ చూస్తోంది.
ఇదే సరైన సమయం
ఓటుకు నోటు సమయంలో రేవంత్ను దెబ్బతీద్దామన్న తెరాస ఆలోచనలు అంతగా ఫలించలేదని అంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది సరైన సమయంగా భావిస్తున్నారు. అందుకే నేతలు ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది.