చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు: రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర రిజర్వాయర్కు కెసిఆర్ ప్లాన్
హైదరాబాద్: బ్రిక్స్ బ్యాంకు నుంచి రూ.25 వేల కోట్ల రుణం తీసుకుని.. రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం నగరం నలువైపులా ఉన్న వాటిని శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలన్నారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న సంగారెడ్డి, వికారాబాద్, షాద్నగర్, చౌటుప్పల్, భువనగిరి, ఘట్కేసర్, తూఫ్రాన్లలో శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండ కార్పొరేషన్లలో అభివృద్ధికి రుణం అందించాల్సిందిగా బ్రిక్స్ బ్యాంకు ఛైర్మన్తో మాట్లాడామన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు కోసం కొంత కారిడార్ ఉందని, దానిని దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇలాంటి అభివృద్ధి పనులు చేపడితేనే హైదరాబాద్ అంతర్జాతీయస్థాయి నగరంగా ఎదుగుతుందన్నారు.
స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా సోమవారం పుపుల్స్ ప్లాజా వద్ద చెత్తను సేకరించే ఆటో ట్రాలీలు, ఇంటింటికి రెండేసి చెత్త డబ్బాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. నగరంలో ప్రస్తుతమున్న ఎలుకల్లాంటి ఫ్త్లెఓవర్లు సరిపోవన్నారు.
చైనా పర్యటన సందర్భంగా అక్కడి ఆకాశ మార్గాలను పరిశీలించాననీ, అక్కడి కన్సల్టెన్సీ ప్రతినిధులు మన దగ్గర ఫ్లై ఓవర్ల నిర్మాణానికి సంబంధించి నివేదిక రూపొందించారన్నారు. త్వరలోనే అధికారులు చైనా పర్యటనకు వెళ్లే అవకాశముందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నష్టానికీ, కష్టానికీ గురైందని, భగవంతుని దయవల్ల బతుకుతున్నామన్నారు.
నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరైన రిజర్వాయర్లు లేవనీ, ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. 240 కిలో మీటర్ల దూరం నుంచి గోదావరి నీటినీ, 200 కిలో మీటర్ల దూరం నుంచి నాగార్జున సాగర్ నీటిని నగరానికి తీసుకురావాల్సి వస్తోందన్నారు.
ఈ సమస్య పరిష్కరించేందుకు ఒక్కోటి 15 టీఎంసీల సామర్థ్యం ఉండే రెండు కొత్త రిజర్వాయర్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కేశవాపురం వద్ద ఒక రిజర్వాయర్ను దిండి ప్రాజెక్టుకు అనుసంధానం చేసి, రామోజీ ఫిల్మ్సిటీ సమీపంలో మరో రిజర్వాయర్ను నిర్మిస్తామన్నారు.
రూ.1,900 కోట్ల హడ్కో రుణంతో జీహెచ్ఎంసీలో విలీనమైన 12 మున్సిపాలిటీలకు తాగునీటిని అందించేందుకు అనుమతులు ఇచ్చామన్నారు.
నగరంలో వర్షం వస్తే కార్లు పడవల్లా మారుతున్నాయని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు రూ.10 వేల కోట్లు అవసరమవుతుందని అధికారులు ఇప్పటికే తనకు నివేదించినట్లు చెప్పారు. పారిశుద్ధ్యం విషయంలో ముందడుగు వేశామని, అందులో భాగంగానే ఆటో ట్రాలీలు, చెత్తడబ్బాలను అందిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల సమ్మె సమయంలో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కెసిఆర్ చెప్పారు.