డిసెంబర్లోపే ఎన్నికలు: వ్యతిరేకత నిజమే.. స్వయంగా సీఎం కేసీఆర్ ప్రచార వ్యూహం?
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా కొద్దీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో కొత్త ఆందోళన మొదలైంది. పార్టీలో రకరకాల అంతర్గత సర్వేల పేరుతో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక పెద్ద సమస్య వచ్చిపడింది. అధికార టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లల్లో పరిస్థితి, అక్కడి ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఆయా స్థానాలను సీఎం కేసీఆర్ మూడు కేటగిరీలుగా విభజించారని పార్టీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా గెలుపే ప్రధానంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. తేలిగ్గా గెలిచే స్థానాలు, గెలవడానికి కష్టపడాల్సి వచ్చే స్థానాలు, మరింత కష్టమైన స్థానాలుగా విభజించి సమాచారం తెప్పించుకుని సీఎం కేసీఆర్ విశ్లేషిస్తున్నారని తెలిసింది.
పరిస్థితి బాగాలేని సెగ్మెంట్లలో వ్యూహంపై సీఎం కేసీఆర్ ఇలా
సర్వే నివేదికల ఆధారంగానే సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంతోపాటు అందుకు అవసరమైన ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. పార్టీ పరిస్థితి బాగాలేని నియోజకవర్గాల పరిధిలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ‘నిఘా' వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టారని సమాచారం. కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 2018 డిసెంబర్లోపే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో ఆయన అలర్టయ్యారని వినికిడి.
విద్యార్థి, యువతలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నదని ఆందోళన
ప్రత్యేకించి కాంగ్రెస్ వ్యూహాత్మక దాడి, దానికి అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిదాడికి అనుసరిస్తున్న తీరుపై సంతోషంగా లేరని సమాచారం. టీపీసీసీ వరుస భేటీలు, రహస్యంగా టీజేఏసీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి చేస్తున్న ప్రయత్నాలు సీఎం కేసీఆర్కు ఇబ్బందికరంగా మారుతున్నట్లు తెలుస్తోంది. జేఏసీ చైర్మన్ కోదండరాం రహస్యంగా నిర్వహిస్తున్న సమావేశాలతో యువత, విద్యార్థుల్లో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం నెలకొల్పుతున్నారని సమాచారం. దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందస్తుగా నాలుగు నెలల నుంచి ఆరు నెలల ముందే సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారన్న సమాచారం కేంద్రం నుంచి లభిస్తున్నది.
సానుకూల వాతావరణ కల్పనపై భారీ ప్రచార వ్యూహం
2018 డిసెంబర్ లోపే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగితే దీంతో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొద్ది సమయమే మిగిలి ఉన్నందున సానుకూల వాతావరనం నెలకొల్పేందుకు భారీగా ప్రచారవ్యూహం అమలు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల వారీగా పర్యటనలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు ప్రధాన ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను ఆకర్షించాలని లక్ష్యంగా సీఎం కేసీఆర్ సాగుతున్నారు. యాదవులు, ముదిరాజులు, గంగపుత్రులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, గౌడ్లు తదితర సామాజిక వర్గాల ప్రతినిధులతో సమావేశమై తాయిలాలు ప్రకటించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. ఇక పార్టీ గెలిచిన నియోజకవర్గాలే కాక, విపక్ష పార్టీలు గెలిచిన చోటా పార్టీ పరిస్థితిపై అంచనా వేస్తున్నారని సమాచారం. దీంతో మూడు కేటగిరీల్లో ఎక్కడున్నామో తెలియక నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం
Recommended Video
అతికష్టంగా గెలిచే స్థానాలపై ఇలా టీఆర్ఎస్ ఫోకస్
సర్వేల ఆధారంగా వచ్చిన ఫలితాలను క్రోడీకరించుకున్న తర్వాత 119 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో 51 తేలిగ్గా గెలిచే కేటగిరీ, 20 కష్టపడాల్సిన, మిగిలిన 48 భారీగా కష్టపడాల్సిన కేటగిరీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని అత్యధికంగా కష్టపడాల్సిన నియోజకవర్గాల్లో ఒకే పార్టీ నేతలు వరసగా గెలుస్తున్నారని, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు ఇందులో ఉన్నాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలుపొందింది. ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన 25 మంది ఎమ్మెల్యేలు కలుపుకోగా టీఆర్ఎస్ శిబిరంలో 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ స్థానాలతో పాటు, గత ఎన్నికల్లో గెలవని నియోజకవర్గాల్లో ఈసారి ఎక్కడెక్కడ తేలిగ్గా గెలుస్తామో.. ఎక్కడ కష్టపడాలో, ఎంత దృష్టిపెట్టినా ప్రయోజనంలేని స్థానాలేమిటో గుర్తించారని తెలుస్తోంది.
ఇప్పటివరకు మూడు రకాల అంతర్గత సర్వేలు
గతంలో అంతర్గతంగా మూడు సర్వేలు నిర్వహించారు. తొలి సర్వే వివరాలను ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా అందించారు. రెండో సర్వే అనంతరం సీఎం కేసీఆర్ స్వయంగా ఆయా ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా చర్చించి సూచనలు చేశారు. కానీ మూడో సర్వే, తాజాగా చేపట్టిన మరో సర్వే ఫలితాల విషయంలో గోప్యత పాటించడంపై పార్టీ శ్రేణులు చర్చిం చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పూర్తిగా తమ సొంత నియోజకవర్గాలకే పరిమితమై పనుల్లో మునిగిపోయారు. అభివృద్ధి కార్యక్రమాలు, పర్యటనలతో మండలాలు చుట్టేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా ప్రజల్లోనే ఉండాలన్న అధినేత ఆదేశాలతో అసెంబ్లీ స్థానాల పరిధిలో మరింత గ్రాఫ్ పెంచుకునే పనిలో పడ్డారని సమాచారం. మరోవైపు మున్ముందు ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకంగా క్రమంగా పెరుగుతుందన్న వాస్తవాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారని సమాచారం. తద్వారా స్వయంగా రంగంలోకి దిగి విపక్షాల ప్రతికూల దాడిని ఎదుర్కొనేందుకు వ్యూహాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. వచ్చే 12 నెలల కాలంలో 31 జిల్లాల్లో సుడిగాలి పర్యలను చేయాలని పార్టీ శ్రేణుల్లో పునర్జీవనం సాధించడంతోపాటు ఇప్పటివరకు తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని ఆయన తలపోస్తున్నారని వినికిడి.