'మహా' ఒప్పందం: అల్లుడ్ని మెచ్చుకున్న కెసిఆర్, గత పాలకులపై విసుర్లు
హైదరాబాద్: మహారాష్ట్ర కుదిరిన ఒప్పందంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నీటి పారుదల శాఖ మంత్రి, తన మేనల్లుడు హరీష్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో మంత్రి హరీష్రావు అహర్నిశలు కష్టపడుతున్నారని ఆయన ప్రశంసించారు.
మహారాష్ట్రతో ఇవాళ చేసుకున్న ఒప్పందం విషయంలో యువ నాయకుడు హరీష్రావు రాత్రింబవళ్లు కష్టపడ్డారని అన్నారు. మహారాష్ట్ర సీఎం, అక్కడి నీటి పారుదల శాఖ అధికారులతో అనేకసార్లు చర్చించిన అనంతరం ఒప్పందం జరిగిందన్నారు.
పలుమార్లు హరీష్రావు మహారాష్ట్రకు వెళ్లి అనుమానాలను నివృత్తి చేశారని తెలిపారు. హరీష్ చొరవతోనే మహారాష్ట్ర సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రెండు రాష్ర్టాలకు న్యాయం జరుగుతుందని మహారాష్ట్ర ప్రభుత్వానికి వివరించామని చెప్పారు.
తెలంగాణ సాధించుకున్న నాడు ఎంత సంతోషపడ్డానో.. ఇవాళ కూడా అంతే సంతోషపడుతున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు ముంబై పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్టు వద్ద ప్రసంగించారు.
"ఇంత పెద్ద ఎత్తున స్వాగతం తెలపడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. రాష్ట్రం విడిపోతే కనీసం నీళ్లు కూడా దొరకవని దుష్ప్రచారం చేశారు. మహారాష్ట్రతో ఇవాళ చేసుకున్న ఒప్పందం తెలంగాణ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించతగ్గది" అని ఆయన అన్నారు.
కృష్ణా, గోదావరి నీళ్లు బీడువారిన పొలాలన్నింటికీ పారాలి. రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ కావాలని అన్నారు. పొరుగు రాష్ర్టాలతో కయ్యం పెట్టుకుని ఇచ్చంపల్లి ప్రాజెక్టు దక్కకుండా చేశారని, లివ్ అండ్ లెట్ లివ్ పద్ధతిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించామని అన్నారు.
సామరస్య పూర్వకంగా ప్రాజెక్టులు కట్టుకుందామంటే మహారాష్ట్ర ఒప్పుకుందని చెప్పారు. మహారాష్ట్రకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసి ఈ ఒప్పందం చేసుకున్నామని, ఈ ఒప్పందం కోసం యువ నాయకుడు హరీష్రావు రాత్రింబవళ్లు కష్టపడ్డారని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన రైతులను కోరారు.
సముద్రం పాలయ్యే గోదావరి నీళ్లతో అద్భుతంగా రెండు పంటలు పండించుకుందామని చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. మొదటి దశలో కరీంనగర్, వరంగల్, రెండో దశలో మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. అన్ని జిల్లాల్లోని ప్రాజెక్టులను రెండు, రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని, తొమ్మిది జిల్లాలో కోటి ఎకరాలకు నీళ్లు పారించడమే లక్ష్యమని కెసిఆర్ చెప్పారు.