కొండా దంపతుల కొంప మునిగినట్టేనా..? అన్నీ చూసుకుంటానన్న కేసీఆర్ అంగట్లో ఒదిలేసాడని విమర్శ..!!
Recommended Video
హైదరాబాద్ : వడ్డించే వాడు మనవాడైతే తిండికి కొరతేంటి అనే సామెత ఇప్పుడు రాజకీయాలకు కూడా వర్తించే పరిస్థితులు తలెత్తాయి. రాజకీయాల్లో బాస్ అండదండలు ఉంటే రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు. అదే బాస్ శతకన్నేస్తే శిఖరం మీద ఉన్నా సరే నేలమీదకు దిగి రావాల్సిందే..! ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అచ్చం ఇలాగే సాగుతున్నాయి. అత్యంత ప్రజాధరణ ఉన్న నాయకుల పట్ల గులాబీ బాస్ వ్యవహరిస్తున్నతీరు చర్చనీయాంశమౌతోంది. పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత సముచిత గుర్తింపు ఇవ్వకుండా చద్రశేఖర్ రావు కించపరుతస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తమ విషయంలో చంద్రశేఖర్ రావు ఎలాంటి అవగాహనతో ఉన్నారో తమకే అంతు చిక్కడం లేదని కొండా సురేఖ దంపతులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చౌరస్తాలో కొండ దంపతులు..! దారిలో గులాబీలా...? ముళ్లా..?
కొండా సురేఖ, కొండా మురళి తెలుగు రాష్ట్రాల్లో వీళ్ల గురించి పరిచయం అవసరం లేదు. కొద్దిరోజులుగా వీళ్ల పేర్లు తెలంగాణ రాష్ట్రంలో అందరి నోళ్లలో నానుతున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో హాట్ హాట్గా సాగుతున్న రాజకీయాల్లో వీళ్లు ఏ దారిలో నడుస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ తీసుకున్న అనూహ్య నిర్ణయానికి తోడు, అభ్యర్ధుల ప్రకటన ఆ పార్టీలో అసమ్మతికి కారణం అయింది. 105 మంది జాబితాలో పేరు లేని నేతలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఖంగుతిన్నంతపనైంది కొండ దంపతులకు. పార్టీ అగ్ర నాయకత్వంపై నిప్పులు చెరిగిన కొండా సురేఖ, ఆమె భర్త మురళీధర్ రావు దారెటెన్నది ఇంకా స్పష్టత లేకుండా ఉంది.
కేటీఆర్ ని కాదని కేసీఆర్ కొండా దంపతులకు ప్రాధాన్యం ఇస్తారా..? ఇది జరిగే పనేనా..?
పార్టీ అగ్ర నాయకత్వంపై నిప్పులు చెరిగిన కొండా సురేఖ, ఆమె భర్త మురళీధర్ రావు దారెటెన్నది ఇంకా స్పష్టత లేకుండా ఉంది. తమకు టికెట్ ఖరారు చేయలేదని ఆగ్రహం చెందిన కొండా దంపతులు విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై నేరుగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్ ఎందుకివ్వలేదో 24 గంటల్లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినప్పటికీ టీఆర్ఎస్ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఆ తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పినప్పటికీపలు కారణాలతో వాయిదా పడింది.
టీఆర్ఎస్పై యుద్ధం ప్రకటించిన కొండా ..! మళ్లీ సానుకూల వాతావరణం ఉంటుందా..?
టీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొండా దంపతుల అనుచరులు విడతల వారీగా పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సురేఖకే వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సురేఖకు టికెట్ ఇస్తే లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామంటున్నారు. అయితే, టీఆర్ఎస్పై దాదాపు యుద్ధం ప్రకటించిన కొండా దంపతులకు తిరిగి పార్టీలోకి స్వాగతం పలికే అవకాశం లేదని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడంతో వారికి టీఆర్ఎస్ ద్వారాలు మూసుకుపోయినట్లయిందని అంటున్నారు.
ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే..! ముహూర్తం కోసం వెయిటింగ్..!
టీఆర్ఎస్లో తిరిగి ఆహ్వానం లేకపోతే కొండా దంపతులకు ఉన్న అవకాశం కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో చేరడం దాదాపు ఖరారు అయినట్లేనని ప్రచారం జరుగుతోంది. హస్తం పార్టీలో చేరితే వరంగల్ తూర్పుతో పాటు పరకాల టికెట్ కూడా కేటాయించాలని మురళీధర్ రావు షరతు విధించినట్లుగా చెప్పుకొంటున్నారు. మహాకూటమిలో భాగంగా మిత్రపక్షాలకు పరకాల టికెట్ కేటాయించే అవకాశం ఉన్నందున.. ఆ స్థానాన్ని ఇవ్వలేమని కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు సమాచారం. దీంతో కొండా దంపతులకు ఏటూ కాకుండా పోయిందని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి భవిష్యత్పై ఆసక్తి నెలకొంది.